ఆంధ్రప్రదేశ్లోని డిగ్రీ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరం నుంచి తెలుగు మాధ్యమం మూతపడనుంది. ఇక నుంచి విద్యార్థులు తెలుగులో చదివే అవకాశం కోల్పోనున్నారు. కళాశాలలన్నీ పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోకి మారిపోనున్నాయి. ఉన్నత విద్యపై ఫిబ్రవరి 2న ఆ రాష్ట్ర సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయంతో ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ కళాశాలలు ఆంగ్ల మాధ్యమంలోనే కోర్సులు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటన విడుదల చేసింది. నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ఆంగ్లంలో నిర్వహిస్తేనే ఆమోదించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తెలుగు మాధ్యమంలో కోర్సులు నిర్వహిస్తున్న ప్రైవేటు కళాశాలలు మాధ్యమం మార్పునకు ఈనెల 18 నుంచి 28 వరకూ ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది. ప్రతిపాదనలు సమర్పించకపోతే కళాశాలలు కోర్సులను నిర్వహించేందుకు వీలుండదని స్పష్టం చేసింది.
65వేల మందిపై ప్రభావం
ఆంగ్ల మాధ్యమం అమల్లోకి రావడంతో తెలుగులో చదివే 65వేల 981 మంది విద్యార్థులపై ప్రభావం చూపనుంది. గతేడాది 13 వందల 36 కళాశాలల్లో 2 లక్షలా 60 వేల మంది చేరగా... వీరిలో 65 వేల మంది తెలుగు మాధ్యమాన్ని ఎంచుకున్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఆంగ్లం ఒక్కటే అమలు చేస్తే వీరు తెలుగులో చదివే అవకాశాన్ని కోల్పోనున్నారు.
ఇదీ చదవండి: Rains: అల్పపీడన ప్రభావం.. నేడూ రేపూ మోస్తరు వానలు