AP CS On PRC: పీఆర్సీపై కమిటీ నివేదికను సీఎం జగన్కు అందించామని ఏపీ సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. పీఆర్సీపై మూడు రోజుల్లోనే సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఇందుకు సంబంధించిన నివేదికను వెబ్సైట్లో ఉంచుతామన్నారు. ఫిట్మెంట్పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చామన్న సీఎస్.. ఇతర రాష్ట్రాలు ఇచ్చిన ఫిట్మెంట్ను పరిశీలించామన్నారు. పీఆర్సీ, ఫిట్మెంట్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని పేర్కొన్నారు. పీఆర్సీ అమలుతో రూ.8 వేల నుంచి 10 వేల కోట్ల అదనపు భారం పడనుందని వివరించారు.
'పీఆర్సీపై కమిటీ నివేదికను సీఎంకు అందించాం. పీఆర్సీపై సీఎం జగన్ 3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. పీఆర్సీ నివేదికను వెబ్సైట్లో ఉంచుతాం. ఫిట్మెంట్పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చాం. పీఆర్సీ అమలుతో రూ.8 వేల నుంచి 10 వేల కోట్ల అదనపు భారం పడనుంది' - సమీర్ శర్మ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికీ ఫిట్మెంట్ సిఫారసు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ వివరించారు. అధికారులు, నిపుణులతో చర్చించాకే ఫిట్మెంట్పై సీఎం ప్రకటన చేస్తారని సీఎస్ చెప్పారు. పెండింగ్ డీఏలపై ఆర్థికశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై విభజన పెను ప్రభావం చూపింది. తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ.2,37,632 కాగా, ఏపీలో అది కేవలం రూ. 1,70,215గా ఉంది. రూ. 6,284 కోట్ల విద్యుత్ బకాయిలు ఇంకా తెలంగాణ నుంచి రావాల్సి ఉంది. రెవెన్యూ లోటు కింద ఉన్న రూ. 18,969.26 కోట్లు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. రూ.20 వేల కోట్ల అదనపు భారం పడింది. ఇంతటి కష్టాల్లో కూడా ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాల కోసం అనేక నిర్ణయాలు తీసుకుంది. జులై 1, 2019 నుంచి 27 శాతం ఐఆర్ను ఇచ్చింది. ఐఆర్ రూపంలో ఉద్యోగులకు రూ.11,270.21 కోట్లు, పెన్షనర్లకు రూ.4,569.78 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. అంగన్వాడీ, ఆశావర్కర్లు సహా వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులతో కలిపి మొత్తంగా 3,01,021 మంది ఉద్యోగులకు ఈ ప్రభుత్వం జీతాలు పెంచింది. తద్వారా ఏడాదికి వీరికి జీతాల రూపంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.1,198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లకు పెరిగింది. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు సహా ఇతర ప్రయోజనాలను ఈ ప్రభుత్వం అందించింది. ప్రభుత్వ విభాగాలు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు తదితర ఉద్యోగులకూ వర్తింపజేసింది. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 5 లక్షల రూపాయలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా కూడా వీరికి అమలు చేస్తోంది. ఈ చర్యల వల్ల ప్రభుత్వంపై రూ. 360 కోట్ల మేర ఏడాదికి అదనపు భారం పడుతోంది’ - ఏపీ సీఎస్ సమీర్ శర్మ
14.29 శాతం ఫిట్మెంట్కు సిఫార్సు