మేడ్చల్ జిల్లాలో రుణ యాప్ల వేధింపులు తట్టుకోలేక శనివారం నాడు గుజ్జ చంద్రమోహన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంపై పోలీసులు స్పందించారు. చంద్రమోహన్ మొదటగా కొంత డబ్బు తీసుకుని.. దానిని తీర్చడానికి ఇతర రుణ యాప్ల ద్వారా డబ్బు తీసుకున్నాడని తెలిపారు. అవి తీర్చకపోవడంతో టెలికాలర్స్ ఒత్తిడి పెరిగి మనస్తాపానికి గురైనట్లు ఇన్ స్పెక్టర్ రమేశ్ వెల్లడించారు.
యాప్ల ద్వారా మొదటగా 60 వేల రూపాయలు తీసుకుని.. సుమారు రూ.3లక్షల వరకు చెల్లించినట్లు కుటుంబసభ్యులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరినైనా లోన్ యాప్కు సంబంధించిన వ్యక్తులు వేధిస్తే అధైర్యపడకుండా తమకు ఫిర్యాదు చేయాలన్నారు. పోలీసులు అండగా ఉంటారని పేర్కొన్నారు.
రుణయాప్ల వేధింపులకు పేట్బషీరాబాద్ పీఎస్ పరిధిలోని గుండ్లపోచంపల్లికి చెందిన చంద్రమోహన్ శనివారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అవసరాల కోసం 9 యాప్ల నుంచి సుమారు లక్ష రూపాయల వరకు రుణాన్ని తీసుకున్న చంద్రమోహన్.. వాటిని తిరిగి కట్టలేకపోయారు.
ఇదీ చూడండి: దా'రుణ' యాప్ వేధింపులు.. యువకుడు ఆత్మహత్య