పోలవరం ప్రధాన డ్యాంలో రూ.683 కోట్లతో అదనపు పనులు చేపట్టేందుకు జలవనరులశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. అంచనాలు సిద్ధం చేసి టెండరు డాక్యుమెంట్లు రూపొందించి న్యాయసమీక్షకు పంపారు. సంబంధిత న్యాయకమిషన్ వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాల్సిందిగా కోరిందని పోలవరం ప్రాజెక్టు ఎస్ఈ నరసింహమూర్తి చెప్పారు. అభ్యంతరాలన్నింటినీ న్యాయ కమిషన్ పరిశీలించిన తర్వాత టెండర్లు పిలిచేందుకు అనుమతించాల్సి ఉందన్నారు. ఆ అనుమతి తర్వాత టెండర్లు పిలిచి తక్షణమే పనులు ప్రారంభించనున్నారు. వచ్చే వరద సీజన్లోగా ఈ పనులు పూర్తిచేయాల్సి ఉంటుంది. కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తిచేసి గోదావరి వరద నీటిని స్పిల్ వే వైపు మళ్లించేందుకు అప్రోచ్ ఛానల్ తవ్వి పూర్తిచేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో పోలవరం ప్రాజెక్టులో మరికొన్ని పనుల అవసరం ఏర్పడింది. డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ సమీక్షించి ఆకృతులకు ఆమోదం తెలిపిన మీదట ఈ పనులు చేపట్టాలని నిర్ణయించారు.
ప్రధాన రాతి, మట్టి కట్ట నిర్మాణం చేయాల్సి ఉంది. అది ప్రధాన డ్యాంలో మొత్తం మూడు భాగాలుగా ఉంటుంది. మూడో భాగంలో కాంక్రీటు డ్యాం నిర్మించాలని డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ తేల్చిచెప్పింది. ఆ కాంక్రీటు డ్యాం నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. వీటితో పాటు ప్రధాన డ్యాం మొదటి భాగంలోనూ పనులు చేయాల్సి ఉంది. పోలవరంలో స్పిల్ వే నిర్మాణం పూర్తవుతోంది. స్పిల్ ఛానల్ కాంక్రీటు పనులు జరుగుతున్నాయి. ఈ రెండింటికీ కుడి, ఎడమ గట్ల వద్ద నీరు పొర్లిపోకుండా ఏటవాలుగా రక్షణ గట్ల పనులు చేయాల్సి ఉంది. 902 కొండ ప్రాంతాన్ని మినహాయించి మిగిలిన ప్రాంతంలో రెండువైపులా పనులు చేయాల్సి ఉంది. స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ అనుసంధానమయ్యే చోట డయాఫ్రం వాల్ మాదిరి కట్ ఆఫ్ వాల్ నిర్మాణం చేపట్టాలని ఆకృతుల కమిటీ సూచించింది.
ప్రధాన డ్యాం ప్రాంతంలో మరిన్ని పనులు
రాతి, మట్టి కట్టగా నిర్మించే ప్రధాన డ్యాం రెండో భాగంలో కొంతమేర నల్లమట్టి నేలలు గుర్తించారు. దానివల్ల ప్రధాన డ్యాం నిర్మించిన తర్వాత దిగిపోయే పరిస్థితి రాకుండా మెటల్తో పనులు చేయాల్సి ఉంది. దాదాపు 500 మీటర్ల మేర ఈ పని చేయాలి. ఇందుకోసం టెండరు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిపైనా న్యాయకమిషన్కు పంపారు. ఈ పనుల వివరాలు సంబంధిత కమిషన్ వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంటాయని ఎస్ఈ నరసింహమూర్తి తెలిపారు.