Covid guidelines In Andhra pradesh : ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ వ్యాప్తి నిరోధానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర హోం శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్త నిబంధనలు జారీ చేసింది. నూతన మార్గదర్శకాల ప్రకారం.. పౌరులు బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే.. రూ.100 జరిమానా విధిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విషయంలో వ్యాపార సముదాయాలకు మాత్రం భారీ హెచ్చరికలు చేసింది. మాస్కు లేని వారిని దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతిస్తే.. సదరు యాజమాన్యానికి రూ.10 వేల నుంచి 25 వేల మేర జరిమానా విధించాలని ఆదేశించింది.
కఠిన నిబంధనలు
అంతేకాదు.. ఉల్లంఘనలు జరిగిన వ్యాపార, వాణిజ్య సంస్థలను 2 రోజులపాటు మూసివేసేలా నిర్ణయించింది. దుకాణాలు, వాణిజ్య, వ్యాపార సంస్థల్లో జరిగే ఉల్లంఘనలను 8010968295 నంబరుకు వాట్సప్ ద్వారా తెలియజేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘనలు జరిగితే.. విపత్తు నిర్వహణ, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఈ అంశాలను పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: పెళ్లిలో వ్యాక్సిన్ సర్టిఫికెట్ల చెకింగ్- లేనివారికి మండపంలోనే టీకా