Disha Patrolling Vehicles : ఏపీలో దిశచట్టం అమల్లో భాగంగా దిశ పెట్రోలింగ్ వాహనాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రారంభించారు. సచివాలయం మొదటి బ్లాక్ నుంచి ముఖ్యమంత్రి లాంఛనంగా ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ దిశ పెట్రోలింగ్ను మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లకు 900 ద్విచక్ర వాహనాలు మహిళల రక్షణ కోసం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి.
Disha Patrol Vehicles in AP : జరిగిన నేరానికి సంబందించిన వివరాలు, సమయం, ప్రాంతం వంటి వాటిని గుర్తించి మ్యాపింగ్ చేస్తూ, ఆ సమాచారాన్ని దిశ పెట్రోలింగ్ వాహనాలను పోలీస్ విభాగం అనుసంధానించింది. ఇందులో భాగంగా 163 వాహనాలను కొనుగోలు చేశారు. జిల్లా యూనిట్ కంట్రోల్ రూం నుంచి నేరుగా ప్రత్యక్ష పర్యవేక్షణకు అనుగుణంగా ప్రత్యేక జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దిశ పెట్రోలింగ్ వాహనాల కొనుగోలుకు రూ.13.85 కోట్లను వెచ్చించారు.