రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీం కోర్టు తీర్పును పునఃపరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న తీర్పు సమీక్షపై ఏపీ ప్రభుత్వ అభిప్రాయాలను.. సుప్రీం కోర్టు అడిగి తెలుసుకుంది. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకుంటున్న క్రమంలో జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం సమీక్షించింది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
రిజర్వేషన్లపై ఇందిరా సహానీ కేసు తీర్పు సమీక్షించాలని నిరంజన్ రెడ్డి కోరారు. ఏపీలో రిజర్వేషన్లు 50 శాతం మించి ఉన్నాయా అన్న ప్రశ్నకు.. 50 శాతమే ఉన్నాయని ఆయన తెలిపారు. ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా కలిపితే 1, 2 శాతం అదనమని వెల్లడించారు. ఏపీలో గతంలో రిజర్వేషన్లు 45 శాతం ఉండేవని.. ముస్లింలకు మరో 5 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ముస్లింలకు 5 శాతం ఇవ్వాలన్న జీవోను కోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రాలు 50 శాతం మించి ఇవ్వడానికి వీల్లేదా..? అని అడగ్గా.. సహేతుక కారణాలుంటే రిజర్వేషన్లు 50 శాతం మించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. 50 శాతం పరిమితి సమతూకం కోసమేనని వెల్లడించింది.
ఇదీ చదవండి: రేపట్నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేత