ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ) వాణిజ్య ఒప్పందాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాలని అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి(ఏఐకేఎస్సీసీ) డిమాండ్ చేసింది. ఈ ఒప్పందం రైతులు, పాల ఉత్పత్తిదారుల జీవనోపాధిపై గొడ్డలి వేటులాంటిదని ఆరోపించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏఐకేఎస్సీసీ ఆధ్వర్యంలో ఆర్సీఈపీ వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తూ... రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ విస్సా కిరణ్కుమార్, అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షుడు వేములపల్లి వెంకటరామయ్య, ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు డాక్టర్ అరిబండి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ నలుమూలల నుంచి రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు. నవంబరులో జరగనున్న ఈ ఒప్పందం కారణంగా వ్యవసాయం, పాడి రంగాలపై చూపనున్న దుష్ఫలితాలు, చిన్న పరిశ్రమలు, ఆటోమొబైల్, స్టీల్ వంటి పరిశ్రమలపై చూపనున్న తీవ్ర ప్రభావాలపై రైతు సంఘాల నేతలు విస్తృతంగా చర్చించారు. డబ్ల్యూటీఓ ఒప్పందం కంటే... అత్యంత ప్రమాదకరమైన ఆర్సీఈపీ వాణిజ్య ఒప్పందం చేసుకోకుండా భారత్పై అన్ని స్థాయిల్లో ఒత్తిడి తీసుకొచ్చేందుకు రైతులు, ఇతర అన్ని స్థాయిల్లో శక్తులు సంఘటితం కావాలని సారంపల్లి అన్నారు. ఈ ఒప్పందం నుంచి భారత్ వైదొగడంతో పాటు కొందరు బడా కార్పొరేట్ల ప్రయోజనం కోసం ప్రజల జీవనోపాధిని దెబ్బతీయవద్దని... తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై కేంద్రానికి లేఖ రాయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఒప్పందాన్ని నిరసిస్తూ ఈ నెల 25న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు చేపట్టాలని విస్సా కిరణ్కుమార్ పిలుపునిచ్చారు.