దేశీయ స్టాక్ మార్కెట్లు వారం ఆరంభంలోనే నష్టాలబాట పట్టాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేఫథ్యంలో గత శుక్రవారం నష్టాల్లో ముగిసిన మార్కెట్లు నేటి ఉదయం కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ విపణిలో చమురుధరలు అమాంతం పెరిగిపోవడం తాజా నష్టాలకు కారణంగా తెలుస్తోంది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 459 పాయింట్ల క్షీణతతో 41,006 గా కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 134 పాయింట్లు కోల్పోయి 12, 092 వద్ద ఉంది.
లాభాల్లో ఉన్న షేర్లు
టైటాన్, టీసీఎస్, హెచ్సీఎల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
నష్టాల్లో ఉన్న షేర్లు
ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, మారుతి, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ముడిచమురు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాక్పై ఆంక్షలు విధిస్తామన్న అగ్రరాజ్య ప్రకటనతో ముడి చమురు ధరలు 3శాతం మేర పెరిగాయి. బ్రెంట్ చమురు ధర 70.59 డాలర్లకు చేరింది.
ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లు హాంగ్సెంగ్, నిక్కీ, కోస్పీ నష్టాల్లో కొనసాగుతున్నాయిు. అయితే షాంఘై స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉంది.
రూపాయి క్షీణత
డాలరు మారకంతో పోలిస్తే రూపాయి విలువ 25 పైసలు క్షీణించి రూ.72. 05కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.42 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 66.28 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: 2020లో వృద్ధి ఎలా ఉండబోతుంది?