ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 140కి పైగా దేశాల్లో వ్యాపించింది. వైరస్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక రంగానికి చేయూత అందించే దిశగా దేశాల కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్లతో కోతకు మొగ్గు చూపుతున్నాయి. తాజాగా 0.25 శాతం మేర కీలక వడ్డీ రేట్లలో కోత విధించింది అమెరికా కేంద్ర బ్యాంకు 'ఫెడరల్ రిజర్వ్'. గత రెండు వారాల్లో 'ఫెడ్' వడ్డీ రేట్లను తగ్గించడం ఇది రెండోసారి.
ఆర్థిక లావాదేవీలు పెంచేందుకే..
లావాదేవీలు పెంచి ఆర్థిక రంగానికి ఊతం అందించేందుకే ఫెడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తక్కువ వడ్డీరేట్లతో వ్యాపారాలు, వ్యక్తిగత రుణాలు అందించాలని, ఆస్తుల కొనుగోలు దిశగా వినియోగదారులను ప్రోత్సహించాలని తాజా ప్రకటనలో బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది ఫెడ్. అదే సమయంలో బ్యాంకుల వద్ద ఉండాల్సిన నగదు డిపాజిట్ల శాతాన్ని తగ్గించి మార్కెట్లోకి నగదు ప్రవాహం పెంచేందుకు నిర్ణయం తీసుకుంది.
ఫెడ్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
"ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయం అసాధారణం. ఈ నిర్ణయం పట్ల సంతోషంగా ఉంది. ఎవరూ ఊహించని విధంగా ఫెడ్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యపరిచింది."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అదే బాటలో న్యూజిలాండ్..
న్యూజిలాండ్ కూడా అగ్రరాజ్యం అమెరికా బాటలోనే నడిచింది. కీలక వడ్డీ రేట్లను 0.25 శాతానికి తగ్గించింది.
కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభం తలెత్తదనుందన్న అంచనాల నేపథ్యంలో న్యూజిలాండ్ కేంద్ర బ్యాంకు నిర్ణయం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఇప్పటికే వాణిజ్య బ్యాంకులకు అందించే రుణాలపై వడ్డీరేట్లు 1 శాతానికి తగ్గించింది న్యూజిలాండ్. నేడు మార్కెట్ ప్రారంభానికి ముందు దానిని 0.25 శాతం తగ్గించి 0.75గా మార్చింది. న్యూజిలాండ్ చరిత్రలో వాణిజ్య బ్యాంకుల వడ్డీరేట్లలో ఇదే అతి స్వల్పం. మార్చి 25వరకు ద్రవ్య పరపతి విధానంపై ప్రకటన వెలువడేందుకు అవకాశం లేని కారణంగా తాజా నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి: ట్రేడింగ్ను ఎందుకు, ఎప్పుడు నిలిపేస్తారో తెలుసా?