ఆన్లైన్ దా'రుణ' యాప్ల అంశంపై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) స్పందించింది. తెలంగాణ సహా దేశంలో పలుచోట్ల రుణ యాప్లపై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో అలాంటి యాప్ల ఉచ్చులో పడొద్దని, వ్యక్తిగత వివరాలు, పత్రాలు ఎవరికీ ఇవ్వొద్దని ప్రజలకు సూచించింది. ఆర్బీఐ, ఎన్బీఎఫ్సీకి లోబడి ఉన్న సంస్థల వద్దే రుణాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) యోగేశ్ దయాల్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
యాప్లు ఆర్బీఐ గుర్తింపును చూపాలి..
సులువుగా రుణాలు ఇస్తున్నారన్న కారణంతో వ్యక్తులు, చిన్న వ్యాపారులు ఈ యాప్లకు ఆకర్షితులు అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీజీఎం పేర్కొన్నారు. తీరా రుణాలు ఇచ్చాక అధిక వడ్డీ, హిడెన్ ఛార్జీల పేరిట అధిక మొత్తాలు వసూలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. రుణాలు తిరిగి చెల్లించే విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నాయని, అంతేకాకుండా ముందస్తుగా కుదిరిన ఒప్పందాన్ని దుర్వినియోగం చేస్తూ రుణ గ్రహీతల ఫోన్ల నుంచి వ్యక్తిగత డేటాను వినియోగించడం ఆమోద యోగ్యం కాదన్నారు. యాప్ల మోసాలపై ఆర్బీఐకి చెందిన sachet.rbi.org.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని యోగేశ్ దయాల్ సూచించారు. ప్రజలు కేవలం ఆర్బీఐ వద్ద గుర్తింపు పొందిన బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) వద్ద మాత్రమే రుణాలు తీసుకోవాలన్నారు. అలాగే ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకు, ఎన్బీఎఫ్సీల డిజిటల్ రుణ యాప్లూ తమ గుర్తింపు వివరాలను వినియోగదారుల ముందుంచాలని సూచించారు. గుర్తింపు పొందిన రుణ యాప్లపై ఫిర్యాదుల కోసం https://cms.rbi.org.inను సంప్రదించాలని సూచించారు.
ఇదీ చూడండి:గడువు ముగుస్తోంది- ఐటీఆర్ దాఖలు చేసేయండిలా