బంగారం దిగుమతులు 2020-21 ఏప్రిల్- జులై మధ్య భారీగా తగ్గాయి. నాలుగు నెలల్లో పసిడి దిగుమతులు 81.22 శాతం తగ్గి.. రూ.18,590 కోట్లకు పడిపోయాయి. కరోనా నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులతో డిమాండ్ లేక దిగుమతులు ఈ స్థాయిలో పడిపోయినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇంతకు ముందు 2019-20 ఏప్రిల్-జులై మధ్య బంగారం దిగుమతులు రూ.91,440 కోట్లుగా నమోదు కావడం గమనార్హం.
నాలుగు నెలల కాలంలో పసిడి దిగుమతులు తగ్గినప్పటికీ.. జులై నెలలో మాత్రం 4.17 శాతం పెరిగి.. 1.78 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం.
పసిడి బాటలోనే వెండి దిగుమతులు కూడా 2020-21 ఏప్రిల్-జులై మధ్య 56.5 శాతం తగ్గి.. రూ.5,185 కోట్లుగా నమోదయ్యాయి.
దిగొచ్చిన వాణిజ్య లోటు..
బంగారం, పసిడి దిగుమతుల్లో తగ్గుదల వల్ల దేశ వాణిజ్య లోటు 2020-21 ఏప్రిల్-జులైలో 13.95 బిలియన్ డాలర్లకు దిగొచ్చింది. 2019-20 ఏప్రిల్-జులైలో దేశ వాణిజ్య లోటు 59.4 బిలియన్ డాలర్లుగా ఉంది.
భారత్దే అగ్రస్థానం..
పసిడి దిగుమతుల్లో భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. దేశీయంగా ఆభరణాలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఏడాదికి సగటున 800-900 టన్నుల వరకు బంగారం దిగుమతి చేసుకుంటుంది భారత్.
2020-21 ఏప్రిల్-జులైలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 66.36 శాతం తగ్గి.. 4.17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఇదీ చూడండి:కొద్ది నెలల్లోనే టాటా చేతికి ఎయిర్ ఇండియా!