ప్రపంచ శక్తిమంతమైన దేశాల జాబితాలో.. రానున్న ఏళ్లలో చైనాను భారత్ సమం చేయగలదనే అంచనాలను కరోనా మహమ్మారి తారుమారు చేసిందని తాజా సర్వేలో తేలింది. లేవి ఇన్స్టిట్యూట్.. ఏషియా పవర్ ఇండెక్స్ 2020 ప్రకారం.. ఇండో పసిఫిక్ దేశాలు సహా భారత ఆర్థిక వ్యవస్థలు.. కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్నాయిని వెల్లడైంది.
'ప్రస్తుత పరిస్థితులతో.. చైనా ఆర్థిక వ్యవస్థ అవుట్పుట్లో.. భారత్ 40 శాతాన్ని మాత్రమే సాధించి.. ఈ దశాబ్దాన్ని ముగించొచ్చు. గత ఏడాది ఈ అంచనా 50 శాతంగా ఉంది.' అని లేవి ఇన్స్టిట్యూట్ విశ్లేషకులు తెలిపారు.
'ప్రస్తుత పరిస్థితులతో చాలా దేశాలు గతేడాదితో పోలిస్తే.. తక్కువ శక్తిమంతంగా మారనున్నాయి. చైనా వేగంగా కోలుకోవడం వల్ల.. ఇతర దేశాలకు, చైనాకు మధ్య అంతరం భారీగా పెరుగుతుంది.' అని నివేదిక పేర్కొంది.
ఏషియా పవర్ ఇండెక్స్లో 2020 భారత్కు నాలుగో ర్యాంక్ ఇచ్చింది నివేదిక. 2019తో పోలిస్తే భారత్ స్కోరు 41 పాయింట్ల నుంచి 39.7కి పడిపోయిందని పేర్కొంది. ప్రధాన శక్తివంతమైన దేశాల స్థాయి అయిన 40 పాయింట్ల కిందికి పడిపోవడం వల్ల.. భారత్ ఇప్పుడు 'మధ్యస్థ శక్తివంతమైన' దేశంగా మారిందని నివేదిక పేర్కొంది.
2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ.. కరోనాకు ముందు అంచనాలతో పోలిస్తే 13 శాతం తక్కువ స్థాయిని నమోదు చేస్తుందని నివేదిక అంచనా వేసింది.
మరిన్ని..
ఈ నివేదికలో 81.6 పాయింట్ల స్కోరుతో అమెరికా అత్యంత శక్తిమంతమైన దేశంగా ర్యాంకుని పదిలం చేసుకుంది. అయితే కరోనాతో నెలకొన్న పరిస్థితులతో అమెరికా కూడా భారీ పతనాన్ని చూసిందని నివేదిక పేర్కొంది.
76.1 పాయింట్ల స్కోరుతో చైనా రెండో స్థానంలో నిలిచింది. 41 పాయింట్ల స్కోరుతో జపాన్ మూడో స్థానంలో ఉంది.
ఇదీ చూడండి:జర్మనీ జీడీపీని దాటిన చైనా కుబేరుల సంపద