ప్రపంచంపై కరోనా పట్టుబిగిస్తోన్న కొద్దీ వైద్య సదుపాయాల కొరతపై దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. వైద్య పరికరాలు, ఔషధాల నిల్వలు తగ్గిపోతుండటం కారణంగా ప్రభుత్వాలకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.
ఈ సంక్షోభ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ సంస్థలు.. తమ కర్మాగారాల్లో వెంటిలేటర్లు, వైద్య పరికరాల తయారీని ప్రారంభించాయి. భారత్లోనూ వాహన రంగ సంస్థలు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగాయి.
భారీ లక్ష్యంతో..
కరోనా విజృంభిస్తున్న వేళ వెంటిలేటర్ల ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు సాయమందించాలని కోరింది ప్రభుత్వం. వెంటనే మహీంద్రా సంస్థల అధిపతి ఆనంద్ మహీంద్ర.. తమ కర్మాగారాల్లో వెంటిలేటర్ల తయారీని ప్రారంభించారు.
అమెరికాలోనూ వాహన రంగ దిగ్గజం జనరల్ మోటార్స్.. నెలకు 10 వేల వెంటిలేటర్లను ఉత్పత్తి చేసే లక్ష్యంతో పనిచేస్తోంది. ఫోర్డ్ సంస్థ 50 వేల వెంటిలేటర్ల తయారు చేయాలని ధ్యేయంగా పెట్టుకుంది.
వాహన రంగ సంస్థలే ఎందుకు?
అయితే ఆటోమొబైల్ సంస్థలు మాత్రమే వెంటిలేటర్ల తయారీపై ఎందుకు ఆసక్తి కనబరుస్తున్నాయన్న అనుమానం కలగొచ్చు. కారణం ఇదే..
వెంటిలేటర్లలో తయారీలో ఉపయోగించే కొన్ని భాగాలు వాహన పరిశ్రమలోనూ వినియోగిస్తారు. ఈ మేరకు జీఈ హెల్త్ కేర్, 3ఎం సంస్థలతో కలిసి వెంటిలేటర్లు, రెస్పిరేటర్ల తయారీలో ఫోర్డ్ పనిచేస్తోంది. ఆటో కంపెనీ సాధారణంగా తన కార్ల కోసం ఉపయోగించే ఫ్యాన్లు, బ్యాటరీలు, ఇతర భాగాలతో ఈ వైద్య యంత్రాలను ఉత్పత్తి చేయవచ్చని ఫోర్డ్ తెలిపింది.
ఒకే తయారీ విధానం..
వెంటిలేటర్ల తయారీ పూర్తిగా అసెంబ్లింగ్ పైనే ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణలు చెబుతున్నారు. చిన్న భాగాలను అమర్చి పెద్ద యంత్రాలను రూపొందిస్తారు. కార్ల తయారీదీ అదే సూత్రం. చిన్న విద్యుత్ పరికరాలను అమర్చి.. అనంతరం అసెంబ్లీ ప్లాంట్లలో వాహనాల్లో ఇన్ స్టాల్ చేస్తారు.
ఈ కారణాల వల్ల.. వాహన తయారీ కర్మాగారాల్లో చిన్న చిన్న మార్పులు చేయటం వల్ల వెంటిలేటర్లు ఉత్పత్తిని చేయవచ్చు. అయితే ఇలాంటి వైద్య పరికరాలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. వాహన సంస్థలు వెంటిలేటర్లు తయారు చేసేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.. కొన్ని నిబంధనలను సవరించి ఇప్పటికే అనుమతి ఇచ్చింది.
ఆ సంస్థలతో భాగస్వామ్యం..
అయినప్పటికీ.. వెంటిలేటర్ల తయారీలో వాహన సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వైద్య పరికరాల తయారీదారుల భాగస్వామ్యంతో వీటిని రూపొందిస్తున్నాయి. ఎందుకంటే.. ఈ పరికరాల్లో ఏవైనా పొరపాట్లు జరిగితే వేలాది మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.
వెంటిలేటర్లు చాలా క్లిష్టమైన యంత్రాలు. అధునాతమైన సాఫ్ట్ వేర్, ప్రత్యేకమైన భాగాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో హెల్త్ కేర్ సంస్థలతో పొత్తు వల్ల పరికరాల నాణ్యత, సిబ్బందికి శిక్షణ వంటివి సాధ్యమవుతాయి.
ఇదీ చూడండి: భౌతిక దూరం లక్ష్యంతో 'బ్లూటూత్ స్టెతస్కోప్' ఆవిష్కరణ