దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత లేకుండా టాటా గ్రూప్ చర్యలు వేగవంతం చేసింది. అవసరమైన చోటుకు లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేసేందుకు వీలుగా.. 24 క్రయోజనిక్ కంటైనర్లను దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపింది.
కొవిడ్ 19ను ఎదుర్కొనే సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు తమ సంస్థ అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని స్పష్టం చేసింది టాటా గ్రూప్. ఛార్టెడ్ ఫ్లైట్ల ద్వారా ఈ క్రయోజనిక్ కంటైనర్లను దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొంది.
రోజుకు 700 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి..
ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. జామ్నగర్లోని రిఫైనరీ నుంచి రోజుకు 700 టన్నులకు పైగా.. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ఇక్కడ రోజుకు 100 టన్నుల ఆక్సిజన్ను మాత్రమే ఉత్పత్తి చేసింది రిలయన్స్. చాలా ప్రాంతాల్లో ప్రాణవాయువు అవసరం పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచినట్లు సమాచారం.
ఉత్పత్తి పెంపు ద్వారా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్లలో రోజుకు 70,000 మంది రోగులకు ఆక్సిజన్ అందించే వీలు కలగనుంది.
ఇదీ చదవండి:'రెండు నెలల్లో 4 రెట్లు పెరిగిన ఆక్సిజన్ డిమాండ్'