కృత్రిమ మేధదే ఈ దశాబ్దమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోబోలు కూడా పూర్తిగా కృత్రిమ మేధ సాంకేతికతతోనే రూపొందుతున్నాయి. అమెరికా లాస్ వెగాస్లో జరుగుతున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో(సీఈఎస్-2020)లో ఈ ఆవిష్కరణలే ప్రత్యేకంగా నిలిచాయి.
ఈ ఏడాది సీఈఎస్లో శాంసంగ్ ఆవిష్కరించిన పసుపు బంతి 'బాల్లీ' సూపర్స్టార్గా నిలిచింది. అధునాతన కృత్రిమ మేధ సాంకేతికత తయారు చేసిన ఈ రోబో బంతి ఇంటి భద్రత, శుభ్రత, ఇతర పరికరాలతో అనుసంధానం, దృశ్య చిత్రీకరణ ఇలా ఎన్నో పనులు చేసి పెడుతుంది.
"అంతర్జాల వస్తువుల్లో తర్వాతి తరం ఆవిష్కరణ బాల్లీ. ఇది ఎంతో సహాయకంగా ఉంటుంది. మీ ఇంట్లో తిరుగుతూ నిరంతరం భద్రతను కల్పిస్తుంది. మీరు ఎక్కడ ఉన్నా మీ ఆరోగ్యం, ఫిట్నెస్ను పర్యవేక్షిస్తుంది. వృద్ధులు స్మార్ట్ఫోన్కు అనుసంధానం చేసుకుని అవసరాన్ని బట్టి సాయం పొందవచ్చు. మీ పిల్లలు, పెంపుడు జంతువులకు కొత్త స్నేహితుడు. మీ కుటుంబంలో ప్రత్యేక క్షణాలను ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేస్తుంది."
- సెబాస్టియన్ సియుంగ్, శాస్త్రవేత్త, శాంసంగ్
చిన్నారి రోబోలు..
దిగ్గజ సంస్థలతో పాటు పలు అంకుర సంస్థలూ సీఈఎస్లో సత్తా చాటాయి. లావోట్స్గా పిలిచే చిన్నారి రోబో(రోబో పెట్)లు కూడా సందడి చేశాయి.
జపాన్ మార్కెట్లో ఇప్పటికే లావోట్స్ అందుబాటులో ఉన్నా.. వెగాస్ సీఈఎస్లో కృత్రిమ మేధతో రూపొందిన కొత్తతరం రోబో పెట్స్ను ఆవిష్కరించింది గ్రూవ్-ఎక్స్. ముఖ కవళికలను గుర్తుపట్టడం దీని ప్రత్యేకత. ఇంటికి అతిథులు, స్నేహితులు వచ్చినప్పుడు స్వాగతం పలుకుతుంది ఈ లావోట్. ఇంటి పనుల్లో సహాయకారిగా ఉంటుంది.
మరెన్నో...
ఆరోగ్యం, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాలకు సంబంధించిన రోబోలు సీఈఎస్లో కనువిందు చేశాయి. ఇందులో పిల్లల కోసం తయారు చేసిన రాయ్బి రోబో ధర 199 అమెరికన్ డాలర్ల నుంచి ప్రారంభం అవుతుందని ఉత్పత్తిదారులు తెలిపారు.
ఇదీ చూడండి: దృశ్యం ఇక అపూర్వం- 8కే తెరతో అదిరే టీవీలు