దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ.. సియజ్, స్మార్ట్ హైబ్రీడ్, ఎర్తిగా, ఎక్స్ఎల్6 మెడల్ కార్లను భారీగా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. మోటార్ జనరేటర్ విభాగం(ఎంజీయూ)లో సమస్యల కారణంగా మొత్తం 63,493 కార్లను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. 2019 జనవరి 1 నుంచి 2019 నవంబర్ మధ్య తయారైన కార్లు రీకాల్ చేసే జాబితాలో ఉన్నట్లు మారుతీ పేర్కొంది.
వినియోగదారులు ఏం చేయాలంటే..
ఈ రీకాల్ పరిధిలోకి వచ్చే వాహనాలను సమీపంలోని మారుతీ డీలర్స్ వద్దకు యజమానులు తీసుకువెళ్లాలి. ఏమైనా లోపాలు ఉంటే ఆయా భాగాన్ని మార్చి ఇస్తారు. దీనికి ఎటువంటి ఛార్జీలు ఉండవు. వాహనాలను షోరూంకు తెచ్చిన యజమానులకు అవసరమైతే ప్రత్యామ్నాయ వాహన ఏర్పాట్లు చేస్తుంది కంపెనీ. ఒక వేళ ఎలాంటి సమస్య లేకపోతే వెంటనే ఆ కార్లను డెలివరీ చేయనున్నట్లు పేర్కొంది.
మారుతీ వినియోగదారులు తమ వాహనాలు రీకాల్ పరిధిలోకి వస్తాయో, రావో అనే విషయాన్ని కంపెనీ అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. తమ వాహనం చాసిస్ నంబర్ను కస్టమర్ ఇన్ఫో టాబ్పై ఎంటర్ చేసి నిర్ధరణ చేసుకోవచ్చు.
ఈ ఏడాది ఆగస్టులోనూ దాదాపు 40,618 వేగనార్ కార్లను రీకాల్ చేసి లోపాలను సరిచేసింది మారుతీ.
ఇదీ చూడండి:త్వరలో భారత మార్కెట్లోకి నోకియా 2.3 స్మార్ట్ఫోన్