ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన కార్యాలయాలను జులై 6 నుంచి పునరుద్ధరించాలని నిర్ణయించింది. దశలవారీగా తమ ఉద్యోగులను కార్యాలయాలకు వచ్చేలా ప్రయత్నించనుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఉద్యోగికి అవసరమైన పరికరాలు కొనుగోలు చేసేందుకు 1,000 డాలర్ల (రూ.75 వేలు) చొప్పున అందించనున్నట్లు తెలిపింది.
"జులై 6 నుంచి వివిధ నగరాల్లోని మా కార్యాలయ భవనాలను ప్రారంభిస్తాం. ఆఫీసులకు రావాలనుకునే ఉద్యోగులకు అవకాశం కల్పిస్తున్నాం. ఆఫీసుల్లో పరిమిత సంఖ్యలోనే ఉద్యోగులు ఉండేలా చూస్తాం. రొటేషన్ పద్ధతిలో 10 శాతం మందిని అనుమతిస్తాం. సెప్టెంబరు వరకు 30 శాతానికి పెంచుతాం."
- సుందర్ పిచాయ్, గూగుల్ సీఈఓ
వర్క్ ఫ్రమ్ హోం మరికొన్ని రోజులు కొనసాగాలని గూగుల్ తొలుత నిర్ణయించుకుంది. అయితే చాలా మంది ఉద్యోగులు కార్యాలయాలకు వస్తామని కోరుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది సంస్థ.
"ఉద్యోగులు స్వచ్ఛందంగా రావచ్చు. వారిపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. వర్క్ ఫ్రమ్ హోం ద్వారానే పని చేసేందుకు ప్రయత్నించండి." అని తమ ఉద్యోగులకు పిచాయ్ సూచించారు.