మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విమానాశ్రయేతర వ్యాపారాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు స్టాక్ ఎక్స్ఛేంజీల అనుమతి లభించింది. కార్పొరేట్ హోల్డింగ్ నిర్మాణాన్ని సరళీకృతం చేసే ప్రయత్నాల్లో భాగంగా విమానాశ్రయేతర సంస్థలను విడదీయాలని జీఎంఆర్ ఇన్ఫ్రా ఈ ఏడాది ఆగస్టులో ప్రతిపాదించింది. తమ ప్రణాళికలకు స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి ఎలాంటి అభ్యంతరాలూ లేకుండా అనుమతి లభించిందని సోమవారం జీఎంఆర్ వెల్లడించింది. జీఎంఆర్ పవర్ ఇన్ఫ్రా (జీపీఐఎల్), జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా తదితర కంపెనీలకు సంబంధించి విలీనం సర్దుబాటు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ ప్రతిపాదనలపై 6 నెలల్లో జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు దరఖాస్తు చేయనున్నట్లు పేర్కొంది.
విమానాశ్రయ, విమానాశ్రయేతర వ్యాపారాలను వేర్వేరుగా నమోదు చేయడం ద్వారా మరింత పారదర్శకత తీసుకొచ్చి, ప్రపంచస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడం సహా ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులకు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునే వీలు కల్పించేందుకు ఇది తోడ్పడుతుందని సంస్థ తెలిపింది. విమానాశ్రయ వ్యాపారం స్వతంత్రంగా ఉండబోతోందని పేర్కొంది. ప్రస్తుతం జీఎంఆర్ గ్రూపు దేశంలోని అత్యంత రద్దీగా ఉండే దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్లో రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు, ఫిలిప్పీన్స్లోని సిబూ విమానాశ్రయాన్ని నిర్వహిస్తోంది. సంస్థ పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత దేశంలోని స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదైన ఏకైక విమానాశ్రయ సంస్థగా జీఎంఆర్ ఇన్ఫ్రా అవతరించనుంది.
జీఎంఆర్- మెగావైడ్పై ఫిలిప్పీన్స్లో విచారణ!
విదేశీ ఈక్విటీ పరిమితి చట్టాలను ఉల్లంఘించారనే ఫిర్యాదుపై టూ మాక్టాన్-సిబూ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు, ఆ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్-మెగావైడ్ సిబూ ఎయిర్పోర్ట్ గ్రూపు (జీఎంసీఏసీ)పై ఫిలిప్పీన్స్ ప్రభుత్వం విచారణ జరపనుంది. యాంటీ-డమ్మీ చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లఘించారని అందిన ఫిర్యాదుపై విచారణ జరిపిన నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎన్బీఐ) యాంటీ ఫ్రాడ్ విభాగం ఇప్పటికే కొంతమందిపై న్యాయశాఖ దగ్గర ఆరోపణ పత్రాలను దాఖలు చేసినట్లు వెల్లడించింది. ఇందులో అయిదుగురు ఫిలిప్పీన్స్ ఉన్నతాధికారులు, విమానాశ్రయ ఉన్నతాధికారితో పాటు, 11మంది విదేశీయులపై కేసులు దాఖలయ్యాయి. విదేశీయుల్లో కొంతమంది జీఎంఆర్ గ్రూపు నుంచి ఉన్నారని సమాచారం. ఈ ఆరోపణలను జీఎంఆర్ అధికార ప్రతినిధి ఖండించారు. అవన్నీ నిరాధారమని, కాలక్రమేణా ఈ కేసు పస లేనిదిగా తేలుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు జీఎంసీఏసీకి ఎలాంటి అధికార సమాచారమూ అందలేదని వెల్లడించారు. ‘ఇటీవల ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మాక్టాన్ సిబూ ఇంటర్నేషనల్ అథారిటీకి చెందిన ఒక జనరల్ మేనేజర్ను ముందస్తు చర్యల్లో భాగంగా సస్పెన్షన్లో ఉంచింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇది జరిగింది. మా మీద వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారం. ఈ విషయంలో 100శాతం మాకు విశ్వాసం ఉందని’ సమాధానమిచ్చినట్లు జీఎంఆర్ ప్రతినిధి వెల్లడించారు. బిడ్లో పేర్కొన్న అన్ని అంశాలనూ మేము పూర్తిగా పాటించామని వివరించారు.
ఇదీ చూడండి:ధరల పెంపు బాటలో వాహన తయారీ సంస్థలు