ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలను కరోనా మహమ్మారి ఓ కుదుపునకు గురి చేసింది. దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ గత ఏడాది కాలంలో 5.5 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. గత మూడు దశాబ్దాల కాలంలో ఎమిరేట్స్కు ఇదే అతి పెద్ద నష్టం. పశ్చిమాసియాలోనే ఎమిరేట్స్ అతిపెద్ద విమానయాన సంస్థ కావడం గమనార్హం.
ఏడాది కాలంలో ఆదాయం 66 శాతం తగ్గినట్లు వెల్లడించింది ఎమిరేట్స్. కరోనా ప్రభావంతో ప్రయాణాలపై పలు దేశాలు ఆంక్షలు విధించడం ఇందుకు కారణంగా పేర్కొంది. నిర్వహణ ఖర్చులు 46 శాతం తగ్గించుకున్నా.. ఆదాయం 8.4 బిలియన్ డాలర్లు క్షీణించినట్లు వివరించింది.
క్రితం ఏడాదితో పోలిస్తే ప్యాసింజర్, కార్గో రవాణా 58 శాతం తగ్గిందని ఎమిరేట్స్ వెల్లడించింది. ఈ ఏడాది కాలానికి ముందు సంస్థ లాభం 288 మిలియన్ డాలర్లుగా నమోదైనట్లు తెలిపింది.
కరోనా తర్వాత ఏడాది కాలంలో 66 లక్షల మంది మాత్రమే తమ విమానాల్లో ప్రయాణించిననట్లు పేర్కొంది ఎమిరేట్స్. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 90 శాతం తక్కువని వివరించింది. ప్రస్తుతం ఈ సంస్థ 259 విమానాలను (కార్గోతో కలిపి) నిర్వహిస్తోంది.
ఇదీ చదవండి:Galwan Clash: 'మేడ్ ఇన్ చైనా వస్తువులు మాకొద్దు'