క్రికెట్ మ్యాచ్ వస్తోందంటే టీవీలకు అతుక్కుపోయే వారు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. ఐపీఎల్ అంటే క్రికెట్ ప్రియులకు పండుగనే చెప్పాలి. అయితే ఈ ఐపీఎల్ సీజన్ క్రికెట్ ప్రియులకు వినోదాన్నివ్వడమే కాకుండా..టీవీల వ్యాపారులకు భారీగా విక్రయాలు పెంచుతున్నాయి.
ముఖ్యంగా.. లాక్డౌన్తో ఇటీవల టీవీల విక్రయాలు భారీగా తగ్గిపోయాయి. లాక్డౌన్ సడలించిన తర్వాత కూడా విక్రయాలు మందకొండిగానే సాగాయి. అయితే ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన తర్వాత విక్రయాలు మళ్లీ ఊపందుకున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. పిల్లలకు ఆన్లైన్ క్లాస్లు, వారి ఎంటర్టైన్మెంట్ కోసం కూడా ప్రత్యేకంగా టీవీలు కొనుగోలు చేసేవారు పెరిగారని వారంటున్నారు.
పెరిగిన డిమాండ్ ఇలా..
కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులతో కొంత కాలం ప్రజలు.. కేవలం నిత్యావసరాల కొనుగోళ్లకే పరిమితమయ్యారు. కొన్ని రోజులుగా ప్రజల్లో ఈ ధోరణి మారుతోంది. దీనితో ఎలక్ట్రానిక్ ఉపకరణాల కొనుగోళ్లు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. జూన్ చివరి నుంచే టీవీల కొనుగోలు కాస్త పెరిగినప్పటికీ.. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన తర్వాత 20 నుంచి 45 శాతం వరకు కొనుగోళ్లు పుంజుకున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
చిన్న టీవీలకు తగ్గిన డిమాండ్..
ప్రస్తుతం 32 అంగుళాల స్మార్ట్ టీవీలను కొనేవారు తగ్గారని వ్యాపారులు చెబుతున్నారు. వినియోగదారులు ఎక్కువగా 55 అంగుళాలు, 43 అంగుళాల టీవీలను కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. గతంతో పోలిస్తే.. 55, 43 అంగుళాల టీవీలు అందుబాటు ధరల్లో లభిస్తుండటం కూడా ఇందుకు కారణంగా చెబుతున్నారు.
'ఒకప్పుడు పెద్ద సైజు టీవీల కొనుగోలుకు దాదాపు రూ.70వేలకు పైగా వెచ్చించాల్సి వచ్చేది. ఇప్పుడు కొన్ని బ్రాండ్లు కేవలం రూ.35 వేలల్లో ఈ పరిమాణంలో టీవీలను అందుబాటులోకి తెచ్చాయి.' అని వ్యాపారులు అంటున్నారు.
లాక్డౌన్తో టీవీల విక్రయాలు భారీగా 60 శాతం వరకు పడిపోయినట్లు.. సోనో విజన్ స్టోర్ మేనేజర్ మరళీ కృష్ణ చెప్పారు. ఐపీఎల్ తర్వాత ఈ విక్రయాలు మళ్లీ భారీగా పెరిగినట్లు తెలిపారు. ముఖ్యంగా ఎల్ఈడీలపై వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.
పండుగ ఆఫర్లు
గత కొంత కాలంగా ప్రజలు ఎలక్ట్రానిక్ ఉపకరణాల కొనుగోళ్లకు దూరంగా ఉన్న దృష్ట్యా.. పండుగ సందర్భంగా వ్యాపారం భారీగా పెరుగుతుందని షోరూంల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకొని, ఇప్పటికే కంపెనీల ఆఫర్లను ప్రకటించాయి. క్యాష్బ్యాక్ నుంచి కారు బహుమతుల వరకు ఇందులో ఉన్నాయి. కరోనా నేపథ్యంలో డిష్ వాష్లు, మైక్రోవేవ్లు కూడా ఆఫర్లో ఇస్తున్నట్లు చెబుతున్నాయి. ఇవన్ని పండుగ సీజన్లో విక్రయాలు పెరిగేందుకు దోహదం చేస్తాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి:కేంద్రం-రాష్ట్రాల మధ్య వీడని 'జీఎస్టీ' ప్రతిష్టంభన