పన్ను చెల్లింపుదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆదాయపు పన్ను విభాగం కొత్త వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, దీంట్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయంటూ యూజర్లు భారీ ఎత్తున కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేశారు.
ఇన్ఫోసిస్ దృష్టికి..
దీనిపై స్పందించిన ఆమె సమస్యను ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ నందన్ నిలేకని దృష్టికి తీసుకెళ్లారు. మెరుగైన సేవలు అందించడంలో ఇన్ఫోసిస్, నిలేకని పన్ను చెల్లింపుదారులను నిరాశకు గురిచేయరని భావిస్తున్నానంటూ సమస్యను ట్విటర్ వేదికగా వారికి తెలియజేశారు. యూజర్లకు అనుకూలమైన సేవలు అందించడమే తొలి ప్రాధాన్యం కావాలని సూచించారు.
ఇ-ఫైలింగ్ వెబ్సైట్
పాత వెబ్సైట్లో ఉన్న ప్రతికూలతలను తొలగిస్తూ తర్వాతి తరం ఐటీ ఇ-ఫైలింగ్ వెబ్సైట్ను అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వం ఇన్ఫోసిస్కు 2019లో అప్పగించింది. రిటర్నుల ప్రక్రియను 63 రోజుల నుంచి ఒక్కరోజు తగ్గించడమే లక్ష్యంగా కొత్త సైట్కు రూపకల్పన చేశారు. గతంలో జీఎస్టీఎన్, జీఎస్టీ పేమెంట్ అండ్ రిటర్న్ ఫైలింగ్కు సైతం ఇన్ఫోసిసే వెబ్సైట్ను రూపొందించింది. 2017లో జీఎస్టీ వెబ్సైట్ విడుదల చేసిన సమయంలోనూ అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
గత రాత్రి 8:45 గంటల సమయంలో కొత్త ఐటీ ఇ-ఫైలింగ్ సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి సైట్కు ఒక్కసారిగా యూజర్ల తాకిడి పెరిగింది. దీంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
కొన్ని ఫీచర్లు గతంలో పాత సైట్ తీసుకున్న సమయం కంటే ఎక్కువ తీసుకుంటున్నాయని యూజర్లు ఆన్లైన్ వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు.
ఇదీ చదవండి : ఆ రెండు బ్యాంకుల ఉద్యోగులకు వీఆర్ఎస్!