Shortage of silicon wafers: టాటా గ్రూప్ 300 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,250 కోట్ల) పెట్టుబడితో సెమీ కండక్టర్ చిప్ల తయారీ ప్లాంట్ను యుద్ధ ప్రాతిపదికన నెలకొల్పాలని భావిస్తున్నా, సిలికాన్ వేఫర్ల వంటి ముడి పదార్థాల కొరతతో ఆటంకాలు ఏర్పడేలా ఉన్నాయని ఫిచ్ రేటింగ్స్ అనుబంధ సంస్థ ఫిచ్ సొల్యూషన్స్ నివేదిక వెల్లడించింది. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయంగా సిలికాన్ వేఫర్ల కొరత ఏర్పడిందని పేర్కొంది.
కొవిడ్ పరిమాణాల వల్ల డేటాకు, వినియోగదారు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు గిరాకీ బాగా పెరిగిందని, ఇందుకు తగ్గట్లు సెమీకండక్టర్ల తయారీదార్లు సరఫరా చేయలేకపోతున్నారని పేర్కొంది. సెమీకండక్టర్లను అధికంగా ఉత్పత్తి చేస్తున్న తైవాన్, అమెరికా, జపాన్ వంటి దేశాల్లో వాతావారణం సహకరించకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు సరఫరా వ్యవస్థపై ఒత్తిడి మరింత పెంచుతున్నాయని వివరించింది.
తెలంగాణ సహా 3 రాష్ట్రాల పరిశీలన
టాటా గ్రూప్ చిప్ల తయారీ యూనిట్ నెలకొల్పేందుకు వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు సాగించాక, ప్లాంట్ ఏర్పాటుకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అనువైనవని భావిస్తున్నట్లు సమాచారం. ఎక్కడ ఏర్పాటు చేయనుందో ఈ నెలాఖరులోపు వెల్లడించే అవకాశం ఉందని, 2022 చివరి కల్లా కార్యకలాపాలు ప్రారంభింప చేయాలన్నది లక్ష్యమని తెలిసింది.
సెమీ కండక్టర్ల అసెంబ్లీ, టెస్టింగ్ కేంద్రాన్ని పొరుగు సేవల (ఔట్ సోర్సింగ్) విధానంలో నిర్వహించాలని టాటా గ్రూప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధునాతన సిలికాన్ వేఫర్లను తైవాన్ కేంద్రంగా పనిచేసే సెమీకండక్టర్ ఫౌండ్రీలైన టీఎస్ఎంసీ వంటి సంస్థల నుంచి సమీకరించి, వాటితో చిప్సెట్లు అసెంబ్లింగ్, టెస్టింగ్ను దేశీయంగా చేయడమే టాటా గ్రూప్ ప్రణాళికగా చెబుతున్నారు.
ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లు వస్తుండటంతో 2022 మధ్య వరకు, లేదంటే 2023 వరకు సెమీకండక్టర్ వేఫర్ల లభ్యతకూ ఇక్కట్లు తప్పవని చెబుతున్నారు. ఇది టాటా ప్రణాళికలకు అవరోధంగా నిలిచే అంశమని ఫిచ్ పేర్కొంది.
దేశీయంగా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ పెంచేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. వాటికి కావాల్సిన చిప్సెట్లు అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టాటా గ్రూప్ భావిస్తోంది. అయితే వేఫర్ల కొరతను అధిగమించాల్సి ఉందని ఫిచ్ సొల్యూషన్స్ పేర్కొంది.
ఇదీ చూడండి: ధరల పెంపు బాటలో టాటా, హోండా, రెనో!