భారతీయ కంపెనీలలో సగానికి పైగా వేతన చెల్లింపుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ తెలిపింది. ఈ పరిస్థితి జీతాల కోతకు దారి తీస్తుందని వెల్లడించింది. ఫలితంగా వినియోగ డిమాండ్ తగ్గటమే కాకుండా ఆర్థిక పునరుద్ధరణ మరింత ఆలస్యమవుతుందని అంచనా వేసింది.
దేశంలోని 40 వేల కంపెనీల్లో పరిస్థితులను విశ్లేషించినట్లు క్రిసిల్ ఎండీ ఆశు సుయాశ్ వెల్లడించారు. సుమారు 12 లక్షల కోట్లను వేతనాలు చెల్లించే ఈ సంస్థలపై అధ్యయనం ఆధారంగా తాజా నివేదికను రూపొందించినట్లు తెలిపారు.
"వేతనాల పరిమాణంలో 52 శాతం, సంస్థల సంఖ్యలో 68 శాతం బలహీనతను మేం గమనించాం. ఈ పరిస్థితులు లేఆఫ్, లేదా తొలగింపులకు దారి తీయకపోవచ్చు. కానీ, జీతాల్లో భారీ కోత విధించే అవకాశం ఉంది. ఫలితంగా ఆర్థిక పునరుద్ధరణ నెమ్మదిగా సాగుతుంది."
- ఆశు సుయాశ్, క్రిసిల్ ఎండీ
కంపెనీల ఆదాయమూ 14- 17 శాతం పడిపోయే అవకాశం ఉందని ఈ నివేదిక అంచనావేసింది. దీని ప్రభావంతో వినియోగ డిమాండ్పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ పరిణామాలు లేఆఫ్లకూ దారితీసే ప్రమాదం లేకపోలేదు. ఈ ధోరణిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇందులో వినియోగ డిమాండ్కు ప్రాధాన్యం ఇవ్వాలి.
2008 మాంద్యం కన్నా తక్కువే..
ఏదీఏమైనా వినియోగం తగ్గటం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుందని సుయాశ్ అన్నారు. జీడీపీలో 10 శాతం శాశ్వత నష్టం ఉంటుందని వెల్లడించారు. అయితే కంపెనీలపై ఈ ప్రభావం 2008 ఆర్థిక మాంద్యం నాటి పరిస్థితులకన్నా తక్కువే ఉంటుందని తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు సమయానికి బ్యాంకుల నిరర్ధక ఆస్తులు 11.5 శాతం పెరుగుతాయని క్రిసిల్ అంచనావేసింది. 1991 చెల్లింపుల సంక్షోభంతో పోలిస్తే ఇది చాలా తక్కువేనని తెలిపింది. రంగాలవారీగా పొడింగిపులు, మారటోరియం, రుణాల పునరుద్ధరణ వంటి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించాలని సూచించింది.
ఇదీ చూడండి: ఏప్రిల్-జూన్ మధ్య గృహ విక్రయాలు 67% డౌన్