కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ పతనమైంది. పలు ప్రైవేట్ రంగ సంస్థలు కార్యకలాపాలు లేక కుదేలయ్యాయి. ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు తమ సిబ్బందిని తగ్గించుకునే యోచనలో ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది.
'లే ఆఫ్ సర్వే 2020' పేరుతో 68శాతం ఉద్యోగులను సర్వే చేసింది మైహైరింగ్క్లబ్ డాట్ కామ్, సర్కారి నౌకరీ డాట్ ఇన్ఫో. ఈ నివేదిక ప్రకారం ఇప్పటికే పలు సంస్థలు ఉద్యోగాల కోత ప్రారంభించగా.. మరికొన్ని కంపెనీలూ ఇదే ఆలోచనలో ఉన్నట్లు తేలింది.
2020 మే 1 నుంచి మే 10 మధ్య కాలంలో ఆన్లైన్ సర్వే ద్వారా 25 నగరాల్లో 1,124 కంపెనీలను సర్వే చేశారు నిర్వహకులు.
సర్వేలోని ముఖ్యాంశాలు...
- 73 శాతం సంస్థలు తమ ఉద్యోగుల జీతాల్లో కోత విధించగా... 57 శాతం కంపెనీలు సిబ్బందిని తాత్కాలికంగా తొలగించే యోచనలో ఉన్నాయి. 21శాతం సంస్థలు ఉద్యోగులను రెండేళ్ల వరకు తొలగించనున్నాయి.
- 32 శాతం సంస్థలు.. తమ ఉద్యోగులను తొలగించాలని అసలు ఆలోచించడం లేదు.
- రిటైల్, ఎఫ్ఎంసీజీ రంగంలో అత్యధికంగా 48శాతం మంది ఉపాధి కోల్పోయారు. దీని తర్వాత ఆస్పత్రులు, విమాన, రవాణా రంగంతో కలిపి 48 శాతం, ఆటోమొబైల్ తయారీ రంగం 41 శాతం, రియల్ఎస్టేట్ 39 శాతం, పవర్ సెక్టార్ 38 శాతం ఉద్యోగాలు కోల్పోయి .. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- 6 నుంచి 10 ఏళ్ల అనుభవం ఉన్నవారే 31శాతం ఉపాధి కోల్పోయారు. 11-15 ఏళ్లు అనుభవం ఉన్నవాళ్లు 30 శాతం, 15 ఏళ్లు అనుభవం దాటిన వాళ్లు 21 శాతం,1 నుంచి 5 ఏళ్లు అనుభవం గల జూనియర్ ఉద్యోగులు 18 శాతం ఉపాధి కోల్పోయారు.
గరిష్ఠంగా ఆ సంస్థలే...
'వైరస్ సంక్షోభంతో రిటైల్, ఆటోమొబైల్, తయారీ, రవాణా,ఆస్పత్రులు, విమానాయాన పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇవి కోలుకోవడానికి సమయం పడుతుంది. జీతాల్లో కోత, ఉపాధి కోల్పోవడం వల్ల ఖర్చు తగ్గిపోయి... వ్యాపార రంగం పూర్తిగా దెబ్బతింద'ని నివేదికలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: వైద్యులు, సామాన్యులకు డబ్ల్యూహెచ్ఓ 'యాప్' సాయం