ప్రజా పంపిణీ వ్యవస్థ సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'వన్ నేషన్, వన్రేషన్ కార్డు' విధానాన్ని 9 రాష్ట్రాలు అమల్లోకి తీసుకొచ్చాయి. దీంతో ఆయా రాష్ట్రాలు రూ.23,523 కోట్లు అదనంగా అప్పులుగా తీసుకునేందుకు అనుమతించినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా.. గోవా, గుజరాత్, హరియాణా, కర్ణాటక, కేరళ, త్రిపుర, ఉత్తర్ప్రదేశ్ ఈ జబితాలో ఉన్నాయి.
ఈ విధానాన్ని తీసుకురావడం ద్వారా గరిష్ఠంగా యూపీ రూ.4851 కోట్ల మేర అప్పు తీసుకునే వెసులుబాటు లభించింది. ఆ తర్వాత కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు లబ్ధి పొందనున్నాయని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. రాష్ట్రాలు అదనంగా రుణం పొందాలంటే 2020 డిసెంబర్ 31 వరకు గడువు ఉందని పేర్కొంది. ఈ లోగా మరిన్ని రాష్ట్రాలు ఇందులో చేరతాయని ఆశాభావం వ్యక్తంచేసింది.
కొవిడ్-19 వ్యాప్తితో రాష్ట్రాల ఆదాయం భారీగా పడిపోయిన నేపథ్యంలో.. రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి అప్పు తీసుకునేందుకు కొన్ని షరతులు విధించింది కేంద్రం. అందులో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ఒకటి. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా జీఎస్డీపీలో 0.25 శాతం అదనంగా రుణాలు తీసుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. దీంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విద్యుత్ సంస్కరణలు వంటివి అమలు ద్వారా మరిన్ని రుణాలు తీసుకునే వీలు కల్పించింది. మరోవైపు వన్ రేషన్ విధానం వల్ల బోగస్ రేషన్ కార్డుల ఏరివేతతో పాటు రేషన్కార్డుదారులు ఎక్కడైనా సరకులను తీసుకునే వీలు కలుగుతుందని కేంద్రం చెబుతోంది.
ఇదీ చదవండి: భూమి హక్కు సైతం మానవ హక్కే!