బ్యాంకులు డెబిట్ లేదా క్రెడిట్ కార్డును జారీ చేసినప్పుడు.. అవి అన్ని రకాల లావాదేవీలకు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉంటాయి. ఇదే ఆన్లైన్ సైబర్ నేరాలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు.. కార్డులను జారీ చేసినప్పుడు ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడానికి, పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్) యంత్రాల ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకే వీలయ్యేలా చూడాలని ఆర్బీఐ చెప్పింది. ఒకవేళ కార్డుదారుడికి ఆన్లైన్ సేవలు అవసరమైతే.. ప్రత్యేకంగా బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా కార్డు జారీ చేసినా.. పాత కార్డు స్థానంలో కొత్తది ఇచ్చినా ఈ నిబంధన వర్తిస్తుంది.
ఇవీ నిబంధనలు...
- అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించేందుకు, ఆన్లైన్, కాంటాక్ట్లెస్ లావాదేవీలకు సంబంధించి కార్డుపై ప్రత్యేక సేవలను బ్యాంకును సంప్రదించి పొందాల్సి ఉంటుంది. అంటే.. కార్డుదారునికి అవసరం అయినప్పుడు మాత్రమే ఈ సేవలను యాక్టివేట్ చేయించుకోవచ్చు.
- ఇప్పటికే ఉన్న కార్డులనూ ఇలా అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. మీకు వచ్చిన కార్డుతో ఇప్పటి వరకూ ఆన్లైన్, అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించకుంటే.. ఆ కార్డులో ఇక ఆ లావాదేవీలు చేయకుండా నిలిపివేస్తారు. అప్పుడు బ్యాంకును సంప్రదించి ఆ సేవలను పొందాల్సి ఉంటుంది.
- డెబిట్, క్రెడిట్ కార్డులలో ఏ సేవలు అందుబాటులో ఉండాలి, వేటిని నిలిపివేయాలనేది ఖాతాదారు/కార్డుదారుడి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ మార్పు రోజులో ఎప్పుడైనా చేసుకోవచ్చు. మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, ఐవీఆర్ ద్వారా కూడా ఈ మార్పులు చేసుకోవచ్చు.
- ఇందులో ఆన్లైన్ లావాదేవీలకు అనుమతి, ఏటీఎం నుంచి నగదు తీయడం, ఎంత వరకూ తీయొచ్చు.. లావాదేవీల పరిమితి ఇలా అనేక అంశాలు ఇందులో ఉంటాయి. ఇప్పటికే పలు జాతీయ, ప్రైవేటు బ్యాంకులు తమ మొబైల్ యాప్ల ద్వారా ఈ సేవలను అందిస్తున్నాయి. మీ బ్యాంకు మొబైల్ యాప్ను ఓసారి పూర్తిగా చూడండి.
- ఆన్లైన్ లావాదేవీలను నిలిపివేస్తే(ఆఫ్) ఎవరైనా సైబర్ నేరగాళ్లు మీ కార్డు ద్వారా కొనుగోళ్లు చేయాలని చూస్తే వీలు కాదు.
ఇక్కడో ఇబ్బంది కూడా ఉందండోయ్.! మీరు మీ మొబైల్ యాప్ ద్వారా మీ కార్డు ఆన్లైన్ లావాదేవీలను ‘ఆఫ్’ చేశారనుకుందాం... ఏదైనా ఆన్లైన్లో కొనేటప్పుడు లావాదేవీ పూర్తవదు. కాబట్టి ‘ఆన్’ చేశాకే ఆన్లైన్లో వాడాలి.
ఇదీ చదవండి: అంబానీకి ఇష్టమైన ఆహారం ఇదే.. ధరెంతో తెలుసా?