జీవిత బీమా హామీ కోసం ప్యూర్ టర్మ్ పాలసీని తీసుకోవడం మంచిది. టర్మ్ పాలసీలో తక్కువ ప్రీమియంతో అధిక బీమా హామీ పొందొచ్చు. టర్మ్ పాలసీని వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్లు వచ్చే దాక పాలసీని కొనసాగించాలి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.
కేంద్ర ప్ర్రభుత్వం ఈ నెల 1న ఆర్థిక సంవత్సరం 2020-21 బడ్జెట్ ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ప్రస్తుతం ఉన్న పన్ను శ్లాబులతోపాటు, మరొక విధానం కూడా అందుబాటులోకి రానుంది. ఇందులో ఎవరికి ఏది అనుకూలమో చూసుకుని.. ఆ విధానాన్ని ఎంచుకోవచ్చు. రెండవ ప్రతిపాదనలో ఎటువంటి పన్ను మినహాయింపులను పొందకూడదు.
అంటే సెక్షన్ 80సి , 80సీసీడీ(1బి), 80డి, 24బి వంటివి.
ప్రామాణిక మినహాయింపు: రూ 50,000
సెక్షన్ 80సి: రూ.1,50,000 (జీవిత బీమా ప్రీమియం, ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్, ఎన్ఎన్సీ, ఎన్పీఎస్, ఐదేళ్ల ఫిక్సెడ్ డిపాజిట్, పిల్లల ట్యూషన్ ఫీజు, యూలిప్స్ , గృహ రుణ అసలు చెల్లింపు మొదలైనవి)
సెక్షన్ 80 సీసీడీ(1బి): రూ.50,000 (ఎన్పీఎస్లో చేసిన అదనపు పెట్టుబడి)
సెక్షన్ 80డి: రూ.25,000 (ఆరోగ్య బీమా ప్రీమియం)
సెక్షన్ 24బి: రూ.2,00,000 (గృహ రుణ వడ్డీ చెల్లింపు)
జీవిత బీమా పాలసీ ప్రీమియం (సెక్షన్ 80సి):
సాధారణంగా ఉద్యోగులందరికీ ప్రావిడెంట్ ఫండ్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే పన్ను ఆదాకోసం చేసే మిగిలిన అనేకమైన వాటిని, వ్యక్తులు తమకు కావలసిన విధంగా మదుపు చేస్తుంటారు. జీవిత బీమా ఏజెంట్లు చెప్పారని, ఎండోమెంట్, హోల్ లైఫ్, మనీ బ్యాక్ , యూలిప్స్ వంటి పాలసీలను తీసుకుంటారు. అయితే వీటిలో జీవిత బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, ప్రీమియం ఎక్కువ. ప్రతి ఒక్కరు వారి ఆదాయాన్ని కొత్త, పాత పన్ను విధానాలతో పోల్చి చూసుకుని.. అవసరమైతే ఇటువంటి పాలసీల నుంచి వైదొలగడం ఉత్తమం.
జీవిత బీమా హామీకోసం ప్యూర్ టర్మ్ పాలసీని తీసుకోవడం మంచిది. టర్మ్ పాలసీలో తక్కువ ప్రీమియంతో అధిక బీమా హామీ పొందొచ్చు. టర్మ్ పాలసీని వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించాలి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సివస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.
గృహ రుణంపై వడ్డీ (సెక్షన్ 24బి):
కొత్తగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రకారం కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నట్లయితే.. పైన తెలిపిన అన్ని మినహాయింపులను వదులుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చినట్లయితే అద్దె ఆదాయం నుంచి గృహ రుణంపై చెల్లించే వడ్డీని 30శాతం స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా మినహాయింపు పొందొచ్చు. అయితే ఈ గృహ రుణంపై చెల్లించే వార్షిక వడ్డీని గరిష్ఠంగా రూ.2లక్షల వరకు మాత్రమే అనుమతిస్తారు.
పీపీఎఫ్:
పీపీఎఫ్లో చేసే మదుపు, వార్షికంగా లభించే వడ్డీ, అలాగే ఉపసంహరణలపై పన్ను మినహాయింపులు భవిష్యత్తులోను కొనసాగుతాయి.
ప్రధాన మంత్రి ఆవాస యోజన:
ఈ పథకం కింద లభించే సబ్సిడీని మరో ఏడాది పాటు అంటే 2021 మార్చి 31 వరకు పొడిగించారు. దీనిపై చెల్లించే వడ్డీపై రూ.1.50 లక్షల వరకు అదనపు పన్ను మినహాయింపు పొందొచ్చు. సరసమైన ధర అంటే రూ.45 లక్షల లోపు ఉన్న ఇల్లు.
కేంద్ర ఆర్ధికమంత్రి తెలిపిన ప్రకారం.. భవిష్యత్తులో మరిన్ని పథకాలను పన్ను మినహాయింపుల నుంచి తొలగిస్తారు. అలాగే తక్కువ పన్ను శ్లాబ్ల కారణంగా మరింత సొమ్ము ప్రజలవద్ద ఉంటుంది. దీనివల్ల పన్ను ఆదాకోసం మదుపు చేయడమే కాకుండా.. ప్రతి సంపాదనాపరుడు తన భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొదుపు(మదుపు) చేయవచ్చు.
ముగింపు:
కొత్త పన్ను విధానం వలన తప్పనిసరిగా చేయాల్సిన మదుపు ఉండదు. పన్ను భారం తగ్గి.. ఎక్కువ సొమ్ము మిగలవచ్చు. అయితే ఈ సొమ్మును తనకు అనుకూలమైన సరైన పథకాలలో మదుపు చేసి, దీర్ఘకాలంలో సంపద సృష్టించుకోవచ్చు. అయితే దీనికోసం నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.
అధిక సొమ్ము చేతిలో మిగలడం వలన అది దుర్వినియోగమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని మదుపు చేసినట్లయితే ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు.
ఇదీ చదవండి: కొత్త పన్ను విధానంతో రిటర్నులు మరింత సులభతరం