దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఈ తరుణంలో ప్రముఖ బీమా కంపెనీలు సరికొత్త పాలసీలతో ముందుకు వస్తున్నాయి. ఈ పాలసీ ప్రజలకు చేరువ చేసేందుకు కొన్ని సంస్థలు డిజిటల్ చెల్లింపు సంస్థలతో భాగస్వామ్యమయ్యాయి.
భారతీ బీమా సంస్థ...
ప్రముఖ భారతీ ఎక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కరోనా పాలసీల కోసం ఎయిర్టెల్ పెమెంట్ బ్యాంక్తో చేతులు కలిపింది. కొత్తగా రెండు పాలసీలను ప్రవేశపెట్టింది. పాలసీ తీసుకున్న వ్యక్తి చికిత్స పొందే సమయంలో 25 వేల రూపాయలు చెల్లించే విధంగా ఒకటి, చికిత్స పొందినంత కాలం రోజుకు రూ.500(ప్రారంభ లబ్ధి) పొందే విధంగా మరో పాలసీని తీసుకువచ్చింది.
బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్...
బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్.. ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే సహకారంతో 'కరోనా కేర్' అనే బీమా పాలసీని తీసుకువచ్చింది.
కేవలం రూ.156 ప్రీమియంతో రూ.50,000 బీమాను అందించనుంది. ఈ పాలసీ 55 ఏళ్ల లోపు వయస్సు వారికి మాత్రమే వర్తిస్తుందని బజాజ్ అలియాంజ్ స్పష్టం చేసింది. కరోనా వైరస్కు చికిత్స అందించే ఏ ఆసుపత్రిలోనైనా చెల్లుతుందని తెలిపింది.
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్....
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, ఎడిల్వైస్ జనరల్ ఇన్సూరెన్స్ కరోనాపై సరికొత్త పాలసీలను తీసుకురానున్నాయి.
కొన్ని బీమా కంపెనీలు నిర్బంధ కేంద్రంలో ఉన్నంత కాలం వారికి అయ్యే ఖర్చులను భరించే పాలసీలను తీసుకురానున్నాయి.
ఇది తప్పని సరి..
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి పథకాలను తీసుకోవాలనుకున్న వారు తప్పకుండా బీమా ఒప్పంద పత్రాలను, నియమనిబంధలను క్షుణ్ణంగా చదవాలని సూచిస్తున్నారు నిపుణులు.