పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి ఖాతా (ఎస్ఎస్ఏ) నిబంధనల్లో ప్రభుత్వం సడలింపులు చేసింది. వీటి ఖాతాదార్లు తప్పనిసరిగా చేయాల్సిన కనీస డిపాజిట్ గడువును మూడు నెలలు (జూన్ 30 వరకు) పొడిగించింది. కొవిడ్-19 నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు ఉన్నందున చిన్న మొత్తాల డిపాజిటుదార్ల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.
పీపీఎఫ్, ఎస్ఎస్ఏ ఖాతాలు క్రియాశీలకంగా (యాక్టివ్) ఉండాలంటే ఖాతాదార్లు ఒక ఏడాదిలో కొంత మొత్తాన్ని డిపాజిటు చేయాల్సి ఉంటుంది. లేకుంటే జరిమానా వసూలు చేస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని 80సి కిందకు ఈ పథకాలు కూడా వస్తుండటంతో సాధారణంగా ఆర్థిక సంవత్సరం చివర్లో ఖాతాదార్లు వీటిల్లో డిపాజిటు చేస్తుంటారు. ‘2019-20లో డిపాజిటు చేయకుంటే ఇప్పుడు జూన్ 30 వరకు పీపీఎఫ్, ఎస్ఎస్ఏ ఖాతాదార్లు డిపాజిటు చేసుకోవచ్చ’ని ఆర్థిక శాఖ వెల్లడించింది. అయితే డిపాజిటు చేసిన తేదీ నుంచే వడ్డీ వర్తిస్తుందని పేర్కొంది.