యూకేకు చెందిన కెయిర్న్ ఎనర్జీ సంస్థకు భారత్ రూ.10,500 కోట్లు చెల్లించాలని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూత్రప్రాయంగా తెలిపారు. పన్ను విధించే తమ దేశ సార్వభౌమ హక్కును ప్రశ్నించే కేసులను సవాల్ చేయటం తన బాధ్యతగా పేర్కొన్నారు.
"రెట్రోస్పెక్టివ్ (పాత తేదీల నుంచి విధించే) పన్ను విధానంపై మా వైఖరిని ఇప్పటికే వెల్లడించాం. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా అదే చెబుతున్నాం. స్పష్టత లేదనే అంశమే లేదు. పన్నులు విధించే భారత సార్వభౌమ అధికారాన్ని ప్రశ్నించే మధ్యవర్తిత్వం ఎక్కడ ఉంది. దానిపై ప్రశ్నలు ఉత్పన్నమైతే.. దానిని సవాల్ చేస్తాం. అది నా బాధ్యత. "
- నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి
అయితే.. కెయిర్న్ వివాదంలో ఆర్బిట్రేషన్ తీర్పును భారత ప్రభుత్వం సవాల్ చేయబోతున్నట్లు మంత్రి నేరుగా వెల్లడించలేదు. కెయిర్న్ సీఈఓ సిమన్ థామ్సన్ సహా ఇతర అధికారులతో ఆర్థిక శాఖ అధికారులు మూడు దఫాలుగా చర్చలు చేపట్టిన తర్వాత కొద్ది రోజులకే నిర్మల ఈ మేరకు స్పందించటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి: అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ తీర్పుపై భారత్ 'సవాల్'?