కన్నడనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 'ఆపరేషన్ కమల'కు సంబంధించిన ఆడియో టేపులపై ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటుకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. శాసనసభ స్పీకర్ రమేశ్ కుమార్ సూచన మేరకు ఆడియో టేపుల్లోని నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు సిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
" స్పీకర్ సూచన మేరకే సిట్ ఏర్పాటు చేశాం. ఆయనను కూడా సిట్ విచారించనుండటం నన్ను బాధిస్తోంది."
- హెచ్డీ కుమారస్వామి, కర్ణాటక ముఖ్యమంత్రి
ఈ ఆరోపణల్లో భాగమైనందున శాసనసభ స్పీకర్ రమేశ్ను కూడా సిట్ విచారించాలని భాజపా నేతలు పట్టుబట్టారు. అప్పుడే తమకు నమ్మకం కలుగుతుందని కమలం పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
స్పీకర్ తనను విచారించేందుకు స్వయంగా అనుమతించడం వల్ల ఆయనను కూడా ప్రశ్నించేందుకు వీలుగా సిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. 15 రోజుల్లోగా నిజానిజాలేంటో నిగ్గుతేల్చాలని అధికారులను ఆదేశించారు.
ఎవరినీ మభ్యపెట్టేందుకు సిట్ ఏర్పాటు చేయలేదని, నిజాలు బయటికి తెచ్చేందుకేనని స్పష్టం చేశారు స్పీకర్ రమేశ్.
అసలేం జరిగింది...
జనతాదళ్ ఎమ్మెల్యేతో భాజపా రాష్ట్రాధ్యక్షులు యడ్యూరప్ప బేరాలాడారని ఆరోపిస్తూ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు 2 గంటల ముందుగా స్వయాన సీఎం కుమారస్వామి ఆడియో టేపును విడుదల చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలులో తమకు అనుకూలంగా వ్యవహరించాలని స్పీకర్కు భాజపా నాయకులు రూ.50 కోట్లు ఆశ చూపారని కుమారస్వామి ఆరోపించారు.
ముఖ్యమంత్రి తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేఎల్పీ నేత యడ్యూరప్ప ప్రకటించటం గమనార్హం.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)