పుల్వామా ఘటనపై నేడు కేబినెట్ భేటీ... జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన కేంద్రం తదుపరి చర్యలపై నేడు సమావేశం కానుంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నేడు సమావేశంలో రాష్ట్రంలోని భద్రతా పరిస్థితులపై సమీక్షించనుంది. వివిధ మంత్రిత్వ శాఖలతో పాటు, ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది.
ఈ భేటీ ఉదయం 9 గంటల 15 నిమిషాలకు జరగనున్నట్లు అధికారుల సమాచారం. ప్రధానమంత్రి నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో రక్షణ మంత్రి, హోం శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి, ఆర్థిక మంత్రి ఉండనున్నారు. ఇందులో భద్రతతో పాటు, వ్యూహాత్మక వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.