13 ఏళ్ల బాలిక.. మూడేళ్ల క్రితం ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో కనిపించింది. ఆ అమ్మాయికి గతం గుర్తులేదు. మూడు సంవత్సరాల తరవాత ఇప్పుడు అన్ని విషయాలను చెబుతోంది. బాలీవుడ్ సినిమాలా ఉన్నా... ఈ సంఘటన నిజంగానే జరిగింది.
2016లో ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలోని రాలగాడ ప్రాంతంలో ఒంటరిగా తిరుగుతున్న 13ఏళ్ల బాలికను పోలీసులు గుర్తించారు. అప్పుడా బాలికకుగతం గుర్తుకు లేదు. తన స్వస్థలం, పేరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. దీంతో పోలీసులు ఆమెను కొరాపుట్ పిల్లల సంరక్షణ కమిటీ(సీడబ్ల్యూసీ)కి అప్పగించారు. అప్పటి నుంచి మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ఆధ్వర్యంలోని ఆశ్రమంలో చికిత్స అందిస్తున్నారు.
మూడు సంవత్సరాల అనంతరం ఇప్పుడు ఆ బాలికకు గతం గుర్తుకువచ్చింది. తాను పుట్టింది బిహార్లోని బోజ్పూర్ జిల్లా అని, బాల్య వివాహం జరిగి ఒక బిడ్డకు సైతం జన్మనిచ్చాననే చేదుగతాన్ని తనకు చెప్పినట్లు సీడబ్ల్యూసీ ఛైర్పర్సన్ గాయత్రి దేవీ తెలిపారు.
ఫోటోల ద్వారా గుర్తించిన తల్లిదండ్రులను సంప్రదించగా, వారు కూడా తమ బిడ్డనేనని అంగీకరించినట్లు తెలిపారు గాయత్రి. కుటుంబానికి అప్పగించిన అనంతరం బాలిక మంచి జీవితాన్ని గడిపేలా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.