16 స్థానాలు సాధించి దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన పాత్ర పోషిస్తామని ఎన్నికల ప్రచారంలో తెరాస పేర్కొంది. కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని అంచనా వేసిన కేసీఆర్... సమాఖ్య కూటమి ప్రతిపాదనతో ఇప్పటికే భాజపా, కాంగ్రెస్యేతర పార్టీలను కలిశారు. ఎంఐఎంతో కలిసి రాష్ట్రంలోని 17 స్థానాలను కైవసం చేసుకుని కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకమవుతామని ప్రకటించారు సీఎం. కానీ... మెజార్టీ సర్వేలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేశాయి. మరీ కేసీఆర్ ప్రతిపాదిత కూటమి పరిస్థితి ఏంటీ?
అంచనా తప్పిందా?
లోక్సభ ఎన్నికలకు ముందే సమాఖ్య కూటమిని ప్రతిపాదించిన కేసీఆర్... ఎన్నికల ప్రచారంలో అదే ప్రచార అస్త్రంగా మలుచుకున్నారు. ఎన్నికలకు ముందు తర్వాత వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలను, ముఖ్యమంత్రులను కలిసి కూటమి ఏర్పాటుపై చర్చించారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి ఆధిక్యం రాదని... ప్రాంతీయ పార్టీలే కీలకం అవుతాయని అన్నారు. సర్వే ఫలితాలు చూస్తే లోక్సభ ఎన్నికలపై కేసీఆర్ అంచనాలు తప్పాయనిపిస్తోంది.
అవకాశం లేనట్లేనా ?
ఎన్డీఏ ఆధిక్యం సాధిస్తే... కూటమికి అవకాశం లేనట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, భాజపా కూటమిలో లేని పార్టీలు 100 నుంచి 125 స్థానాలు సాధిస్తాయని సర్వేలు తేల్చాయి. అలాంటప్పుడు మూడో కూటమికి అవకాశం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. తాను ఏర్పాటు చేయబోయే సమాఖ్య కూటమి తాత్కాలిక ప్రయోజనాల కోసం కాదని... ఇప్పుడు సాధ్యం కాకుంటే మళ్లీ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతామని ఇప్పటికే సీఎం కేసీఆర్ అన్నారు.
ఇదీ చూడండి: జహీరాబాద్ బాద్ షా ఎవరు?