బంగాళాఖాతం వైపు దూసుకొస్తున్న యాస్ తుపాను మరి కొద్ది గంటల్లో అతితీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు-మధ్య బంగాళాఖాతం నుంచి తుపాను.. ఉత్తర-వాయవ్య దిశగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని తెలిపింది. పారాదీప్లో దక్షిణ-ఆగ్నేయ దిశగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని, బాలేశ్వర్లోనూ అదే దిశగా గంటకు 330 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు ఐఎండీ వెల్లడించింది.
అతితీవ్ర తుపానుగా మారిన తర్వాత.. యాస్ తుపాను బుధవారం తెల్లవారుజామున ఒడిశా భద్రక్ జిల్లాలోని ధర్మ పోర్ట్ సమీపంలో తీరం దాటే అవకాశాలున్నట్లు ఐపీఎండీ అధికారి తెలిపారు. ఛాంద్బలీ ప్రాంతంలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని మరో అధికారి అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే బాలేశ్వర్లోని 50 వేల మంది తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
112 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..
యాస్ తుపాన్ ప్రభావం దృష్ట్యా ఐదు రాష్ట్రాల్లో 112 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. ఒడిశాకు 52 సహాయక బృందాలు చేరుకోగా.. బంగాల్కు 45 బృందాలు చేరుకున్నాయి.
వీరితో పాటు ఒడిశాలో.. 60 ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు, 55 స్టేట్ ఆర్మ్డ్ పోలీసు బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఆరా తీశారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈమేరకు జిల్లా అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:జబ్బుల నుంచి రక్షణగా రుచికరమైన పండ్లు