నడిచేందుకే సరైన దారి లేని ఆ అరణ్యానికి అంబులెన్సులు మైలు దూరంలోనే నిలిచిపోయాయి. గుండెను సైతం మార్చేంతగా.. అభివృద్ధి చెందిన వైద్య సదుపాయాలు ఆ తల్లికి పురుడు పోసేందుకు కిలోమీటర్ల ఆవలే ఆగిపోయాయి. గిరిజన మహిళల ప్రసవ వేదనకు మరోసారి సాక్ష్యంగా నిలిచింది పచ్చని అడవి.
కేరళలోని పతనంతిట్ట జిల్లాలో చలకాయమ్ అటవీ ప్రాంతంలో మలమ్బందారమ్ తెగకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. తెగలో ఓ మహిళకు నెలలు నిండుకున్నాయి. ఒక్కసారిగా నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆస్పత్రికి చేరుకోవడానికి గర్భిణీని తీసుకొని కుటుంబీకులు బయలుదేరారు. సరైన దారిలేని కొండ ప్రాంతాల్లో నడవగా.. మహిళకు నొప్పులు మరింతగా ఎక్కువయ్యాయి. అడవి మధ్యలోనే ఆ మహిళ ప్రసవించింది.
సమాచారం అందుకున్న వైద్యులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తల్లీబిడ్డలిద్దరికీ పరీక్షలు చేసి.. క్షేమంగానే ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'యాస్' ఉగ్రరూపం- 11 లక్షల మంది తరలింపు