ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల ధాటికి ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి ఆచూకీ గల్లంతైంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని అధికారులు తెలిపారు. తల్లితో పాటు తన మూడేళ్ల కూతురు, మరో మహిళ ఈ ఘటనలో మరణించినట్లు వెల్లడించారు.
అధికారుల సమాచారం ప్రకారం.. ఆదివారం రాత్రి 8.30 గంటలకు ఉత్తరకాశీ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. మందో గ్రామంలో సుమారు 15-20 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఐదు ఇళ్లు నేలకూలాయి.
గ్రామంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర విపత్తు స్పందన దళం(ఎస్డీఆర్ఎఫ్) టీమ్ ఇంఛార్జ్ జగదాంబ ప్రసాద్ తెలిపారు. కంకరాడి అనే గ్రామంలో రెండు ఇళ్లు వరదలకు కొట్టుకుపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
![UTTARAKHAND CLOUDBURST](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12502010_capture21-6.jpg)
![UTTARAKHAND CLOUDBURST](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12502010_capture21-4.jpg)
![UTTARAKHAND CLOUDBURST](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12502010_capture21-3.jpg)
సీఎం విచారం
మరణాలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఉత్తరకాశీ జిల్లా అధికారులను ఆదేశించారు.
![UTTARAKHAND CLOUDBURST](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12502010_capture21-5.jpg)
మరోవైపు, దెహ్రాదూన్ జిల్లాలోని చిబ్రో హైడెల్ ప్రాజెక్ట్ సొరంగంలో ఆదివారం చిక్కుకుపోయిన ఇద్దరు కూలీలు ఇంకా బయటకు రాలేదని అధికారులు తెలిపారు. ఆక్సిజన్ కొరతతో వీరంతా స్పృహ కోల్పోయారని వెల్లడించారు.
గత మూడు రోజుల నుంచి ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గంగా, యమున, భాగిరథి, అలకనంద, మందాకిని, పిందర్, నందాకిని, సరయూ, గోరి, కాలీ, రామగంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
ఇదీ చదవండి: కేంద్ర మంత్రులు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్?