తమ కుమారుడు కేంద్రమంత్రి పదవి చేపట్టినా ఆ దంపతులు తమ జీవన విధానాన్ని మర్చిపోలేదు. కష్టపడితేనే సంతృప్తిగా బతకలగమని భావించారు. అందుకే.. ముదిమి వయసులోనూ వ్యవసాయ పనులకు వెళ్తూ స్వతంత్రంగా బతుకుతున్నారు. వారే కేంద్ర మత్స్య, పాడి, పశు సంరక్షణ శాఖ, సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ తల్లిదండ్రులు.
ఎల్.మురుగన్ తల్లిదండ్రులు వరుదమ్మల్, లోకనాథన్ది తమిళనాడు నమక్కల్ జిల్లా కొన్నూర్ గ్రామం. అరుంధతియార్ అనే దళిత సామాజికవర్గానికి చెందిన వీరు.. తమ ఊరిలోనే ఓ చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటారు. తమ కుమారుడు ఎల్.మురుగన్ తమిళనాడు భాజపా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా.. వీళ్లు వ్యయసాయ కూలీ పనులకు వెళ్తూనే జీవించేవారు.
'మేం చేసిందేం లేదు'
కేంద్ర మంత్రి స్థాయికి ఎల్.మురుగన్ ఎదగడంలో తాము చేసిందేమీ లేదని అంటారు ఎల్.మురుగన్ తల్లి వరుదమ్మల్. స్వయంకృషితోనే తమ కుమారుడు ఆ స్థాయికి చేరుకున్నారని.. అందుకు తామెంతో సంతోషిస్తున్నామని చెప్పారు. తాము వ్యవసాయ పనులు చేసేందుకు వెళ్లగా వచ్చిన డబ్బులతో తమ కుమారుడిని చదివించామని తెలిపారు.
డాక్టర్ అంబేడ్కర్ న్యాయ కళాశాల నుంచి న్యాయవిద్యను అభ్యసించిన ఎల్.మురుగన్.. కొన్నాళ్లపాటు లాయర్గా పనిచేశారు. అనంతరం ఆయన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో చేరారు. న్యాయవాదిగా ఆయన భాజపా తరఫున ఎన్నో కేసులను వాదించారు.
స్వతంత్రంగా కష్టపడుతూ జీవించడంలోనే తాము సంతోషంగా ఉండగలమని అంటున్నారు లోకనాథన్, వరుదమ్మల్ దంపతులు. రాష్ట్ర ప్రభుత్వం అందించే కొవిడ్ సాయాన్ని తీసుకోవడానికి ఇటీవల వారు క్యూలో నిల్చున్నారని కొన్నూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చెప్పారు.
ఇదీ చూడండి: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ
ఇదీ చూడండి: పేరుకు ప్రైవేటు స్కూల్.. ఫీజు మాత్రం ఏడాదికి రూ.500!