అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారందరూ రావణుని పార్టీ అని కేంద్రమంత్రి సదానందగౌడ విమర్శించారు. రామాయణంలో ఉండే కుంభకర్ణుని పాత్రను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పోషిస్తోందని దుయ్యబట్టారు. పలు దఫాలుగా దేశాన్ని పరిపాలించిన హస్తం పార్టీతో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. భాజపా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి ఇకనైనా.. విభీషణుడిలా తమకు సహకరించాలని కోరారు.
అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తమ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని అన్నారు. ఈ సమయంలో విపక్షాలు కొర్రీలు పెట్టడం ఆపి.. రాముని ఆశీర్వాదం కోసం అందరూ కలిసి రావాలన్నారు. ఆర్ఎస్ఎస్ అనేది అతిపెద్ద ఆర్గనైజేషన్ అని చెప్పిన కేంద్రమంత్రి.. దేశాభివృద్ధికి గొప్ప నాయకత్వాన్ని అందించిందని గుర్తుచేశారు.
రాజకీయ లబ్ధి కోసమే: సిద్ధరామయ్య
రాజకీయ లబ్ధి కోసమే భాజపా రామమందిర నిర్మాణాన్ని తెరపైకి తీసుకువస్తోందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. మందిరానికి ప్రజలు ఇస్తున్న విరాళాలకు సంబంధించిన లెక్కలను బయటపెట్టమని అడిగే హక్కు కాంగ్రెస్కు ఉందన్నారు.
"మా గ్రామంలో నేనూ రామ మందిరం కడతాను. అందుకు గ్రామస్థులు విరాళాలు ఇస్తారు. అందులో ప్రత్యేకత ఏం ఉంది. అయోధ్య రామునికి అందరూ విరాళాలు ఇస్తున్నారు. కేవలం భాజపా మాత్రమే ఇవ్వడం లేదు. ప్రజాసొమ్ము ఖర్చు చేస్తున్నప్పుడు వాటి లెక్కలు అడిగే హక్కు ప్రజలకు ఉంటుంది. రాముని గుడి నిర్మాణాన్ని కమలం నేతలు రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని చూస్తున్నారు."
-సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి