BRAHMAYYA & CO PETITION: మార్గదర్శి కేసులో సోదాల నిమిత్తం మార్చి 28న ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ ఆడిట్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కొ భాగస్వామి పి.చంద్రమౌళి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కంపెనీ నుంచి 7 డెస్క్టాప్లు, 12 ల్యాప్టాప్లు, 2 హార్డ్డిస్క్ల్లోని సమాచారాన్ని కాపీ చేసుకున్నారన్నారు. కేవలం మార్గదర్శికి చెందిన సమాచారమే కాకుండా.. తమ ఖాతాదారులందరి సమాచారం కాపీ చేసుకున్నారని తెలిపారు. దీంతో పాటు కొన్ని పత్రాలనూ తీసుకెళ్లారన్నారు. పంచనామా కూడా ఇవ్వలేదన్నారు. తమ ఖాతాదారుల సమాచారం రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. సీఐడీ అధికారులు మార్గదర్శి, సంబంధిత కంపెనీల సమాచారాన్ని మాత్రమే తీసుకెళ్లామన్నారు. ఇతర కంపెనీల సమాచారం తమకు అవసరం లేదన్నారు. పంచనామా నిర్వహించామని.., ఏం స్వాధీనం చేసుకున్నామన్న సమాచారన్ని మేజిస్ట్రేట్కు ఇచ్చామన్నారు. ఆడిట్ కంపెనీ కొన్ని పత్రాలను దాచిపెడుతుండటంతో సోదాలు చేయాల్సి వచ్చిందన్నారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ... పంచనామాలో పూర్తి వివరాలను పేర్కొనకపోవడంతో సంతకం చేయలేదన్నారు. కాగితాలు, డిస్క్లు అన్నారు తప్ప అందులో ఏం వివరాలు ఉన్నాయో చెప్పలేదన్నారు. ప్రస్తుతం వారి వాదనను పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులను తొలగిస్తే.. సమాచారమంతా బయటపెట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్గదర్శి సమాచారాన్ని విభజన చేసి తీసుకోవాలని.., అది పిటిషనర్ల ముందు జరగాల్సి ఉందన్నారు. మిగిలిన పిటిషన్ల గురించి ఆరా తీయగా.. సోదాలకు సంబంధించి మార్గదర్శి పిటిషన్లు దాఖలు చేసిందని.. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయని... ఎం.వి.దుర్గాప్రసాద్ తెలిపారు.
ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులను కొట్టేయాలంటూ.. మార్గదర్శి ఛైర్మన్, ఎండీలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం.. కఠిన చర్యలు తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు వారి తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, న్యాయవాది విమల్ వాసిరెడ్డి తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. మార్చి 29న బ్రహ్మయ్య అండ్ కొ అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్పై.. సమయం లేక పూర్తిస్థాయిలో విచారణ చేపట్టలేదని.. ప్రస్తుతం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ప్రధాన పిటిషన్తో పాటు శుక్రవారం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను పరిగణనలోకి తీసుకుంటామని.., దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 13వ తేదీకి వాయిదా వేశారు. అప్పటివరకూ మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: