ఆస్పత్రుల్లో ఉండాల్సిన కరోనా రోగులు.. రావి చెట్టు కింద ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ శాహ్జహాపుర్ జిల్లా తిల్హర్ పట్టణం పరిసర ప్రాంతంలో జరిగింది. రావి చెట్టు కింద కరోనా రోగులు ఉన్నారన్న సమాచారం అందుకున్న తిల్హర్ భాజపా ఎమ్మెల్యే రోషన్ లాల్ వర్మ ఆ ప్రాంతానికి వెళ్లి పరీక్షించారు.
![oxygen](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11615895_11.jpg)
![oxygen](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11615895_33.jpg)
"నేను అక్కడికి వెళ్లగా.. దాదాపు 8 నుంచి 9 మంది చెట్టు కింద చాపలు పరుచుకుని ఉన్నారు. నన్ను చూడగానే.. పోలీసులు అరెస్టు చేస్తారని భావించి.. కొంత మంది పారిపోయారు. ఐదారు రోజులుగా వారు ఇక్కడే ఉంటున్నారు."
-రోషన్ లాల్ వర్మ, తిల్హర్ ఎమ్మెల్యే
ఈ విషయం గురించి వైద్య విద్యా శాఖ మంత్రి సురేశ్ ఖన్నాను తాను సంప్రదించడానికి ప్రయత్నించానని ఎమ్మెల్యే రోషన్ లాల్ వర్మ తెలిపారు. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పారు.
![oxygen](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11615895_44.jpg)
నెగెటివ్ వచ్చినా..
ఆక్సిజన్ కోసం రావి చెట్టు కింద పడకలు ఏర్పాటు చేసుకున్నామని రవీంద్ర మౌర్య అనే వ్యక్తి తెలిపారు. తన సోదరికి కరోనా నెగెటివ్ వచ్చినా.. కొవిడ్ వార్డులో చేర్పించారని ఆరోపించారు.
"రావి చెట్టు ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుందని మేము ఇలా కూర్చున్నాం. ఇక్కడ ఉన్న మిగతా వారి ఆక్సిజన్ స్థాయులు కూడా తక్కువగా ఉన్నాయి. నా సోదరిని ఆరోగ్య శాఖ వారు ఆస్పత్రికి తీసుకువెళ్లి కొవిడ్ పరీక్ష చేశారు. అందులో ఆమెకు నెగెటివ్గా వచ్చింది. కానీ, ఆమెను కొవిడ్ వార్డులో చేర్చారు. అందుకని మేం ఇలా రావి చెట్టు కిందకు వచ్చాం."
- రవీంద్ర మౌర్య
మా వద్ద ఆక్సిజన్ ఉంది..
రావి చెట్టు కింద కరోనా రోగులు ఉన్నారన్న తెలుసుకుని.. తమ బృందం అక్కడకు వెళ్లగా ఒక్కరే కనిపించారని తిల్హర్ ముఖ్య వైద్యాధికారి ఎస్పీ గౌతమ్ తెలిపారు. అతనికి పరీక్షలు నిర్వహించగా.. కరోనా సోకినట్లు నిర్ధరణ అయిందని చెప్పారు. సదరు వ్యక్తి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. తమ వద్ద ఆక్సిజన్ కొరత లేదని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆక్సిజన్ లేక భర్తకు నోటితో ఊపిరూదిన భార్య
ఇదీ చూడండి: అంబులెన్స్లో మంటలు- గర్భిణీ సజీవదహనం