Seven Storey House For Birds : పక్షులు అనగానే ఓ చెట్టుపై గూడు కట్టుకుని అందులోనే ఉంటాయని అనుకుంటాం. కానీ ఇక్కడి పక్షులు మాత్రం 7 అంతస్తుల మేడలో ఉంటున్నాయ్.. ఏంటీ పక్షులకు ఏడు అంతస్తుల భవనమా! అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథేంటో తెలుసుకోండి
అలీగఢ్ జిల్లా ఇగ్లాస్ పరిధిలోని దుమేడి గ్రామానికి చెందిన దేవకీనందన్ శర్మ, రామ్నివాస్ శర్మ, రామ్హరి శర్మ, మునేశ్ శర్మ సోదరులు. మరణించిన తమ తల్లిదండ్రుల జ్ఞాపకంగా ఏదైనా మంచిపని చేయాలని అనుకున్నారు. ఈ సమయంలోనే అడవులు అంతరించి పక్షులు అవాసం లేకుండా పోయాయని తెలిసింది. దీంతో ఇలాంటి గూడు లేని పక్షులకు ఏదైనా చేస్తే బాగుటుందని అనుకున్నారు. మనుషులకు ధర్మశాలలు ఉన్నాయి.. ఇలానే పక్షులకు కూడా ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చింది. దీంతో వెంటనే ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారు.


ఇందుకోసం రాజస్థాన్కు చెందిన కళాకారులను సంప్రదించి.. 2021 నవంబర్లో 60 అడుగుల ఎత్తుతో ఏడు అంతస్తుల టవర్ను కట్టారు. ఇందులో వివిధ రంగులతో కూడిన 512 ఫ్లాట్లను నిర్మించారు. దీనికి 'పక్షి ఘర్' అని పేర్ పెట్టారు. వాతావరణ పరిస్థితులకు తట్టుకుని.. ప్రతి కాలంలో పక్షులు సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీని నిర్మాణానికి సుమారు రూ.7 లక్షలు ఖర్చు చేశామని రామ్నివాస్ శర్మ తెలిపారు. ఈ సోదరులు తీసుకున్న నిర్ణయం పట్ల పర్యావరణ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎండను తట్టుకునేలా పక్షుల కోసం చెక్క గూళ్లు..
చిన్నతనంలో ఉదయాన్నే లేవగానే పక్షుల కూని రాగాలతో ఎంతో రమణీయంగా ఉండేది. కానీ ప్రస్తుతం అడవుల నరికివేతతో ఆహారం దొరక్క.. ఎండలకు తట్టుకోలేక అనేక రకాల పక్షులు అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంతరించిపోతున్న పక్షి జాతులను కాపాడేందుకు కృషి చేస్తున్నారు పంజాబ్ బర్నాలాకు చెందిన పర్యావరణ ప్రేమికులు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా పక్షి గూళ్లను పెడుతున్నారు.
బర్నాలాకు చెందిన పర్యావరణ ప్రేమికులు అంతరించిపోతున్న పక్షులను కాపడడానికి నడుం బిగించారు. ఎండలు, వానలు తట్టుకుని ఉండేలా వాటికి చెక్కలతో కూడిన పక్షి గూళ్లను కట్టించారు. ఇలా ఇప్పటివరకు జిల్లాలో ఉన్న మార్కెట్లు, శివార్లలో 6,500 పక్షి గూళ్లను పెట్టారు. ఇందులో ఆహారంతో పాటు నీటిని అందుబాటులో ఉంచారు. వీటితో పాటు పర్యావరణాన్ని కాపాడేందుకు 1.25 చెట్లను నాటారు. గత ఐదు నెలల్లోనే 2 వేల చెట్లను నాటినట్లు బృంద సభ్యులు తెలిపారు. అంతరించిపోయిన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తాము చేసిన ఈ చిరు ప్రయత్నం విజయవంతం అయ్యిందన్నారు. అనేక పక్షులు వచ్చి తాము అమర్చిన గూళ్లలోనే ఉంటున్నాయని చెప్పుకొచ్చారు. దీంతో జిల్లాతో పాటు రాష్ట్రానికి చెందిన అనేక మంది తమతో పని చేయడానికి ముందుకు వస్తున్నట్లు చెప్పారు.



