కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన మరో మూడు పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యవసాయ చట్టాల రాజ్యంగబద్ధతను సవాలు చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు సహా మరో ఇద్దరు వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామ సుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో వీటిని జత చేస్తున్నట్లు సీజేఐ జస్టిస్ బోబ్డే స్పష్టం చేశారు. ప్రతివాదైన కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కొత్త సాగు చట్టాలపై జనవరి 12న స్టే విధించిన సర్వోన్నత న్యాయస్థానం.. అభ్యంతరాలపై అధ్యయనానికి నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. అయితే, సభ్యుల్లో ఒకరైన భూపిందర్ సింగ్.. కమిటీ నుంచి అప్పుడే తప్పుకున్నారు.
ఇదీ చదవండి: ఈ నెల 26న రైతుల 'భారత్ బంద్'