ఇళ్ల కొనుగోలుదార్లను మోసగించారన్న ఆరోపణలతో అరెస్టయిన యూనిటెక్ మాజీ ప్రమోటర్లు(unitech promoters in jail) సంజయ్ చంద్ర, అజయ్ చంద్రాతో.. తిహార్ జైల్ అధికారుల(Tihar Jail officials) సంబంధాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. జైలు అధికారులు, సంజయ్, అజయ్ చంద్రాతో కుమ్మకయ్యారన్న దిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా(delhi police commissioner) నివేదిక ఆధారంగా ఈ ఆదేశాలు ఇచ్చింది.
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి తిహార్ జైలు సిబ్బంది(Tihar Jail officials) సాయంతోనే ఇలా చేయగలిగారని భావించిన ధర్మాసనం.. యూనిటెక్ మాజీ ప్రమోటర్లు (unitech case) సంజయ్ చంద్ర, అజయ్ చంద్రను ముంబయిలోని ఆర్దర్ రోడ్, తాలోగా జైళ్లల్లో విడివిడిగా ఉంచాలని ఆగస్టు 26నే ఆదేశాలు ఇచ్చింది. జైలు సిబ్బంది తీరుపై స్వయంగా దర్యాప్తు జరిపి, నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని దిల్లీ పోలీసు కమిషనర్ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్లో తన నివేదికను సమర్పించారు కమిషనర్.
రాకేశ్ ఆస్తానా(delhi police commissioner) నివేదికను పరిశీలించిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది.
" రాకేశ్ ఆస్తానా నివేదిక ఆధారంగా తిహార్ జైల్ అధికారులు, ఇందులో సంబంధం ఉన్న వ్యక్తులపై అవినీతి నిరోధక చట్టాలు, ఐసీపీలోని ఇతర సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. తిహార్ జైలు నుంచే వ్యాపార కార్యకలాపాలన్నీ చక్కబెట్టారన్న ఈడీ నివేదిక ఆధారంగా అధికారులను సస్పెండ్ చేయండి. అలాగే.. ఈ నివేదిక ఆధారంగా నమోదు చేసిన కేసుల విచారణ వేగవంతం చేయాలి."
- సుప్రీం ధర్మానం.
జైళ్ల నిర్వహణను బలోపేతం చేసేందుకు తన నివేదికలో ఆస్తానా చేసిన పలు సూచనలు పరిశీలించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది ధర్మాసనం. నివేదిక కాపీని హోంశాఖకు అందించాలని సూచించింది. దాంతో పాటు.. ఈడీ, తీవ్ర నేరాల దర్యాప్తు సంస్థ(ఎస్ఎఫ్ఐఓ), దిల్లీ పోలీసుల నివేదికలు సైతం పరిగణనలోకి తీసుకుంది కోర్టు.
ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 21కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: Tihar Jail: జైలు నుంచే దర్జాగా వ్యవహారాలు