మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న తరుణంలో.. ముంబయి రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించడమే లక్ష్యంగా.. ప్లాట్ఫామ్ టిక్కెట్ల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది.
మొత్తం 6 స్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్ విక్రయాలను నిలిపివేయనున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రతినిధి శివాజీ సుతార్ తెలిపారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్(సీఎస్ఎమ్టీ)తో పాటు లోక్మాన్య తిలక్ టెర్మినస్(ఎల్టీటీ), కల్యాణ్, ఠాణే, దాదర్, పన్వేల్ రైల్వే స్టేషన్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయని సుతార్ పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకే ఈ చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు.
ఇప్పటికే.. కరోనా మహమ్మారి నేపథ్యంలో రద్దీని నివారించేందుకు గత మార్చి నెలారంభంలో రాష్ట్రంలోని పలు రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్ ధరలను భారీగా పెంచింది ముంబయి రైల్వే. రూ.10గా ఉన్న టికెట్ ధరను రూ.50గా మార్చింది.
ఇదీ చదవండి: 'విమానంలో పుట్టిందని జనన ధ్రువీకరణ ఇవ్వటం లేదు'