రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ గురువారం దిల్లీకి వెళ్లనున్నారు. సంస్థకు చెందిన ప్రతినిధులతో వరుస అనధికార సమావేశాలు నిర్వహించనున్నారు. ఇది సాధారణ పర్యటనేనని అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే సైతం సమావేశానికి హాజరు కానున్నట్లు చెప్పారు.
త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తర్ప్రదేశ్పైనే సమావేశంలో కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రంలో పరిస్థితులను హోసబలే దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను ఆర్ఎస్ఎస్ చీఫ్కు ఆయన వివరించనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇతర నేతలతోనూ చర్చలు
ఆర్ఎస్ఎస్ సహ సర్కార్యవాస్లైన కృష్ణన్ గోపాల్, మన్మోహన్ వైద్య, హెచ్ఆర్ ముకుంద, రామ్ దత్, అరుణ్ కుమార్ సైతం దిల్లీలోనే ఉన్నారు. వీరితోనూ భగవత్ చర్చలు జరపనున్నారు. ఆరెస్సెస్ అధిష్ఠానం మొత్తం ఇక్కడే ఉన్న నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల విషయంపై సుదీర్ఘ విశ్లేషణ జరిపే అవకాశం ఉందని సమాచారం.
వచ్చే ఏడాది ప్రారంభంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
సహాయ కార్యక్రమాలపై
యూపీతో పాటు త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కరోనా కట్టడి చర్యల గురించి భగవత్కు సంస్థ ప్రతినిధులు వివరించనున్నారు. సంఘ్ చేపట్టిన సహాయ కార్యక్రమాల గురించి చెప్పనున్నారు. భగవత్ కొద్దిరోజుల పాటు దిల్లీలోనే ఉండే అవకాశం ఉందని సంబంధిత వ్యక్తులు తెలిపారు.
ఇదీ చదవండి- ట్విట్టర్లో ఆ 50 మందిని 'అన్ఫాలో' చేసిన రాహుల్