మహిళల వస్త్రధారణపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న క్రమంలో ఆయన సతీమణి రష్మి త్యాగి.. మద్దతుగా నిలిచారు. ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. సందర్భానుసారంగా వివరించలేదన్నారు.
'భారత సమాజాన్ని నిర్మించటంలో మహిళల పాత్ర మరువలేనిది.. మన దేశ సంస్కృతిని, ఐక్యతను, వస్త్రాలను కాపాడటం భారత స్త్రీల బాధ్యత' అని ముఖ్యమంత్రి అన్నారని తెలిపారు. కేవలం కొన్ని పదాలను మాత్రమే పట్టుకుని రాజకీయ లబ్ధి కోసం కొంతమంది వివాదాస్పదం చేస్తున్నారని వివరించారు.
ఉత్తరాఖండ్ సీఎంగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన తీరథ్ సింగ్ రావత్.. మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చిరిగిన జీన్స్ ధరించిన మహిళలు సభ్యసమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ దేహ్రాదూన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
తీరథ్సింగ్ వ్యాఖ్యలపై అనేక మంది మహిళా ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి : 'మహా'పై కరోనా పంజా- రికార్డు స్థాయిలో కొత్త కేసులు