చిన్నపిల్లలు కొవిడ్ బారిన పడితే ఏ విధంగా చికిత్సలు అందించాలనే విషయమై కేంద్రప్రభుత్వం సవివరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) వీటిని పంపించింది. దీని ప్రకారం...
- కరోనాకు గురైన 18 ఏళ్లలోపు పిల్లల ఊపిరితిత్తుల పరిస్థితులను తెలుసుకోవడానికి హై రిజల్యూషన్ సి.టి.స్కాన్ను అంతగా వినియోగించాల్సిన పనిలేదు. ఈ సౌకర్యాన్ని హేతుబద్ధంగా ఉపయోగించాలి.
- అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే రెమ్డెసివిర్(Remdesivir) ఇంజక్షన్లను పిల్లలకు అసలు ఇవ్వకూడదు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారికే స్టెరాయిడ్స్ ఇవ్వాలి.
- వైరస్ లక్షణాలు బహిర్గతం కాకపోయినా, తక్కువగా కనిపించినా యాంటీ మైక్రోబయల్స్ మందులు ఉపయోగించకూడదు.
- ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు పిల్లలను ఆసుపత్రిలో చేర్పించాల్సిన పనిలేదు. ఒకవేళ చేర్పిస్తే వారికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది.
- పిల్లలకు ప్రత్యేకమైన మందులు అంటూ ఏమీ లేవు. జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపించినప్పుడు పారాసిటమాల్ మాత్రలు ఇవ్వవచ్చు. అయితే మాస్కు ధరించడం, దూరాన్ని పాటించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి.
- వ్యాధి తీవ్రత ఒకస్థాయిలో ఉన్నప్పుడు తక్షణమే ఆక్సిజన్ థెరఫీ ప్రారంభించాలి. ఇన్హేలర్ వంటివి వాడకూడదు. రక్తం గడ్డకట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇదీ చదవండి : Covaxin X Covishield: 'ఆ నివేదికలో అనేక లోపాలు'