Puri clay stoves vandalised: ఒడిశా పూరీలోని జగన్నాథ స్వామి గుడిలో అనూహ్య ఘటన జరిగింది. ఆనంద్ బజార్లో ఉన్న మందిర వంటశాలలో మట్టితో చేసిన 40 పొయ్యిలను దుండగులు ధ్వంసం చేశారు. ఆర్థికపరమైన అంశాల్లో తలెత్తిన వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు, ఆలయ అధికారులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ వంటశాల ఆవరణలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు. ఈ నేపథ్యంలో ఎవరు ఈ చర్యకు పాల్పడ్డారనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

విచారణ కోసం ఇద్దరు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ సేవకులు, భద్రతా సిబ్బందిని వీరు విచారిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసి.. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పూరీ జిల్లా మేజిస్ట్రేట్ సమర్థ్ బర్మ తెలిపారు. రెండు రోజుల్లోగా దర్యాప్తు నివేదిక అందించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ధ్వంసమైన పొయ్యిల ద్వారా 15వేల మందికి పైగా భక్తులకు భోజనం తయారు చేయవచ్చు. ఈ గుడిలో రోజూ లక్ష మందికి స్వామివారి భోజన ప్రసాదాన్ని అందిస్తారు.

ఇదీ చదవండి: పబ్జీ దోస్త్ కోసం 'రైలులో బాంబ్'.. పోలీసులు హడల్